చైన్ మార్కెటింగ్లో లక్షలు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య.. "క్యూనెట్" మోసాల కథేంటో తెలుసా?
హైదరాబాద్ : మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలతో ఎందరో బలవుతున్నారు. కొందరు ఆర్థికంగా నష్టపోతే.. మరికొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. చైన్ మార్కెటింగ్ "మాయ" అని తెలిసినా కూడా దానికి అట్రాక్ట్ అవుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం వస్తుందనే ఆశతో గొలుసుకట్టు వలలో చిక్కుకుంటున్నారు. ఆ క్రమంలో "క్యూనెట్" సంస్థ మోసాలకు బలైన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. పెద్దమొత్తంలో డబ్బులు పొగొట్టుకుని చివరకు సూసైడ్ చేసుకోవడం చర్చానీయాంశమైంది.

క్యూనెట్ మోసం.. టెక్కీ సూసైడ్
క్యూనెట్ సంస్థ మల్టీలెవెల్ మార్కెటింగ్ మాయాజాలానికి ఎంతోమంది బలయ్యారు. వేల సంఖ్యలో బాధితులు లక్షలు పొగొట్టుకుని లబోదిబోమంటున్నారు. ఆ సంస్థ నిర్వాహకులపై కేసులు నమోదై జైలుపాలు కావడంతో బాధితులకు డబ్బులు తిరిగొచ్చే మార్గం లేకుండా పోయింది. దాంతో చాలామంది బాధితులు మనస్తాపానికి గురవుతున్నారు. ఆ క్రమంలో హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన అరవింద్ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. కంపెనీ సమీపంలోని చంద్రనాయక్ తండాలో నివాసముంటున్నారు. అయితే కొద్ది నెలల కిందట క్యూనెట్ సంస్థ మల్టీలెవెల్ మార్కెటింగ్ మాయాజాలానికి ఆకర్షితుడయ్యారు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. అయితే ఆ కంపెనీ కాస్తా చేతులెత్తేయడంతో అరవింద్ ఇబ్బందులకు గురయ్యారు. ఆర్థికంగా నష్టపోయి మనస్తాపానికి గురయ్యారు.

20 లక్షలు పెట్టుబడి.. తిరిగొచ్చే దారి కానరాక..!
క్యూనెట్ సంస్థలో 20 లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టి చివరకు నష్టపోయానని కుమిలిపోయిన అరవింద్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెద్దమొత్తంలో డబ్బులు పోయాయని బాధపడుతున్న అరవింద్ మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇక ఎట్టిపరిస్థితుల్లో డబ్బులు తిరిగి వచ్చే మార్గాలు కనిపించకపోవడంతోనే సూసైడ్ చేసుకున్నట్లు భావిస్తున్నారు. అరవింద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే క్యూనెట్ బాధితుడు ఆత్మహత్య చేసుకున్నారనే విషయం బయటకు రావడంతో ఇతర బాధితులు పోగై నగరంలో ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

క్యూనెట్ కథ మొదలైంది ఇలా
మల్టీలెవెల్ మార్కెటింగ్ తో మాయాజాలం చేసిన క్యూనెట్ సంస్థ దేశవ్యాప్తంగా లక్షలాది మందికి కుచ్చుటోపి పెట్టింది. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణంగా భావిస్తున్న క్యూనెట్ మోసాలు అన్నీ ఇన్నీ కావు. దీనికి సంబంధించి 14 కేసులు నమోదు కాగా 58 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 1998లో హాంకాంగ్ కేంద్రంగా క్యూవన్ గ్రూపును స్థాపించారు జోసఫ్ బిస్మార్క్, విజయ్ ఈశ్వరన్. అయితే అందులో నష్టాలు రావడంతో దాన్ని మూసివేశారు. 2001లో భారతదేశానికి వచ్చిన వీరిద్దరు గోల్డ్క్వెస్ట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభించారు. బంగారు కాయిన్ల పేరుతో బిజినెస్ చేశారు.

ఇద్దరే ఇద్దరు.. కోట్లు కొల్లగొట్టారు
వారిద్దరే సూత్రధారులుగా సాగిన ప్రస్థానం.. ఎన్నో కంపెనీలు స్థాపించడానికి కారణమైంది. 2004లో క్వెస్ట్నెట్ ఎంటర్ప్రైజెస్ పేరుతో గోల్డ్ కాయిన్స్, హాలిడే ట్రిప్స్ వంటి కార్యకలాపాలతో చాలామందిని బురిడీ కొట్టించారు. దేశవిదేశాలకు వ్యాపారం విస్తరించి అమాయకుల నుంచి అందినకాడికి దండుకున్నారు. 2010లో కొన్ని ఆరోపణల నేపథ్యంలో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వీరి కంపెనీలపై ఉక్కుపాదం మోపింది. విచారణకు ఆదేశించడంతో సదరు సంస్థల కార్యకలాపాలు స్తంభించిపోయాయి. అయితే 2011లో విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండియా పేరుతో మరో కంపెనీని ప్రారంభించి.. దానికి అనుబంధంగా క్యూనెట్ బ్రాండుతో బిజినెస్, ఎడ్యుకేషన్, హెల్త్, జ్యువెల్లరీ, విహార యాత్రలు తదితర అంశాల్లో ఆకర్షణీయమైన ప్యాకేజీలు తయారుచేసి ఛైన్ మార్కెటింగ్ తో జనాలను బోల్తా కొట్టించారు.

క్యూనెట్ ఉచ్చులో సినిమావాళ్లు, క్రికెటర్లు..!
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో క్యూనెట్ బ్రాండ్ అంబాసిడర్ల బ్యాండ్ మోగింది. ఈ కంపెనీ మోసాల తాలూకు పలువురు నటీనటులు, క్రికెటర్లు తాఖీదులు అందుకున్నారు. అలా క్యూనెట్ మల్టీ లెవెల్ మోసం.. బ్రాండ్ అంబాసిడర్లకు తలనొప్పులు తెచ్చిపెట్టింది. సదరు కంపెనీ మాయాజాలంతో వారు నోటీసులు అందుకోవాల్సి వచ్చింది.
ఆ క్రమంలో కొందరు నటీనటులకు, క్రికెటర్లకు సైబరాబాద్ పోలీసులు ఝలక్ ఇచ్చారు. బాలీవుడ్ కు చెందిన షారూక్ ఖాన్, పూజా హెగ్డే, బొమన్ ఇరానీతో పాటు టాలీవుడ్ కు చెందిన అల్లు శిరీష్ కు నోటీసులు ఇచ్చారు. అటు క్రికెటర్ యువరాజ్ సింగ్ కు కూడా తాఖీదులు పంపించారు. వారం రోజుల్లో విచారణకు హాజరుకావాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యాడ్ లో నటించమని తమ దగ్గరకొచ్చే కంపెనీల పనితీరు చూడకుండా సెలబ్రిటీలు అగ్రిమెంట్లు చేసుకోవడం ఇలాంటి పరిస్థితులకు దారితీస్తోంది.
-
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications