సికింద్రాబాద్ అగ్నిప్రమాదం: ప్రధాని మోడీ దిగ్భ్రాంతి.. 2లక్షల పరిహారం; తెలంగాణా ప్రభుత్వం 3లక్షల పరిహారం
సికింద్రాబాదులోని ఎలక్ట్రిక్ బైక్ షో రూమ్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఇప్పటివరకు ఎనిమిది మంది మృత్యువాత పడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎలక్ట్రిక్ బైక్స్ షోరూంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో పైన ఉన్న హోటల్ లోకి మంటలు వ్యాప్తి చెందటంతో దట్టమైన పొగ కారణంగా అందులో బస చేసిన పర్యాటకులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేయగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలను చేపట్టింది.
మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ 2 లక్షల పరిహారం..
దేశ ప్రధాని నరేంద్ర మోడీ మృతుల కుటుంబాలకు 2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. తెలంగాణలోని సికింద్రాబాద్లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరం అని పేర్కొన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పిఎంఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షలు రూ మరణించిన వారి కుటుంబాలకు ఇస్తామని తెలిపారు. ఈ అగ్ని ప్రమాద ఘటనలో గాయపడిన వారికి 50,000రూపాయలు ఇస్తామని మోడీ ప్రకటించారు. మరోవైపు ఈ ప్రమాద ఘటనపై తెలంగాణా ప్రభుత్వం సైతం స్పందించింది.
తెలంగాణా ప్రభుత్వం మూడు లక్షల రూపాయల పరిహారం
ఇక మరోవైపు ఈ ప్రమాద ఘటనపై తెలంగాణా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చనిపోయిన ఎనిమిది మందిలో నలుగురిని ఇప్పటివరకు గుర్తించారు. తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, ఢిల్లీకి చెందిన ముగ్గురి వివరాలను గుర్తించినట్లుగా నార్త్ జోన్ డిసిపి చందనా దీప్తి తెలిపారు. ఇదిలా ఉంటే ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున మూడు లక్షల పరిహారం ప్రకటించారు మంత్రి కేటీఆర్. సికింద్రాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్, మహమూద్ అలీ
ఇక సికింద్రాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన పై మంత్రి కేటీఆర్ తో పాటు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. బిల్డింగ్ ప్లాన్ ను మిస్ యూస్ చేశారని మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు . అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే మంటలు త్వరగా వ్యాపించాయని 8 మంది పొగ కారణంగానే చనిపోయారు అంటూ తెలిపారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని పేర్కొన్న మహమూద్ అలీ క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారని చెప్పారు . మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూడు లక్షల పరిహారం అందిస్తున్నామని తెలిపారు. ఇక ఎలక్ట్రిక్ బైక్ షోరూం నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.