సింధూ శర్మ కేసులో కొత్త ట్విస్ట్: రిటైర్డ్ జడ్జి నూతి రామ్మోహన్రావుపై ఐపీసీ 354 సెక్షన్ కింద కేసు
హైకోర్టు రిటైర్డ్ జడ్జి నూతి రామ్మోహన్రావు కుటుంబంపై వరకట్న వేధింపుల ఆరోపణలు చేసిన కోడలు సింధూ శర్మ ఇచ్చిన ఆధారాలతో రిటైర్డ్ జడ్జ్ నూతి రామ్మోహన్ పై కేసు నమోదైంది. తనను వేధింపులకు అత్తింటివారు గురి చేస్తున్నారని, తన పిల్లల కోసం పోరాటానికి దిగిన సింధూ శర్మ , మామ రిటైర్డ్ జడ్జ్ నూతి రామ్మోహన్ మధ్య వివాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే . ఇక తాజాగా మామ విషయంలో సింధూ శర్మ చేసిన ఫిర్యాదు , అందించిన వీడియో సాక్ష్యాలు ఆధారంగా ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు .
తన భర్త , అత్తా, మామలు తనను వేధిస్తున్నారని హైకోర్టు రిటైర్డ్ జడ్జి నూతి రామ్మోహన్రావు కోడలు సింధూ శర్మ మహిళా సంఘాలతో కలిసి అత్తింటి ముందు ధర్నా చేసి తన పిల్లలను తనకు అప్పగించాలని కోరటం ఆ తర్వాత ఆమె చేసిన న్యాయపోరాటం అందరికీ తెలుసు.
అయితే ఆ తరువాత ఆమె తనపై జరిగిన వేధింపులకు సంబంధించి ఆధారాలు కూడా సేకరించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా తనపై అత్తింటి వారు చేసిన దాడిని వెలుగులోకి తెచ్చారు. 2.20 నిమిషాల నిడివి గల వీడియోలో, రామ్మోహన్ రావు కుమారుడు ఎన్ వశిష్ట తన భార్య సింధుపై వారి ఇంటి వద్ద ఘర్షణ పడి మధ్యలో ఆమెపై దాడి చేస్తున్నట్లు వీడియో ఫుటేజ్ లో ఉంది .
ఇక ఈ వ్యవహారంపై తాజాగా సింధూ శర్మ చేసిన ఫిర్యాదుతో పోలీసులు మాజీ న్యాయమూర్తి నూతి రామ్మోహన్రావుపై మహిళలపై దాడి, క్రిమినల్ చర్యలకు ప్రోత్సాహించటం వంటి నేరాలకు ఐపీసీ 354 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నూతి రామ్మోహన్రావుపై కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక అంతే కాదు సింధూ శర్మ మామ న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఎన్నో అక్రమాలకూ పాల్పడ్డారని, నూతి రామ్మోహన్రావు రూ.300 కోట్ల మేర ఆస్తులు సంపాదించారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు ఆయన కోడలు సింధూశర్మ లేఖ రాశారు. ఇక ఈ కేసులో ముందు ముందు ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయో .