సీఎం జగన్ కు దక్షిణ తెలంగాణా జేఏసీ నేతల హెచ్చరిక .. హైదరాబాద్ లో తిరగనివ్వమని వార్నింగ్
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై దక్షిణ తెలంగాణ జేఏసీ నేతలు,ఓయూ జేఏసీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణ నీళ్లను దోచుకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు. ఇక అంతే కాదు కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ పరమేశంను కలిసి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఆపాలని వినతి పత్రం అందించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్రంలో తిరిగి ఇవ్వమని హెచ్చరించారు జేఏసీ నేతలు.
జీవో 203 రద్దు చెయ్యాలని దక్షిణ తెలంగాణా జేఏసీ డిమాండ్
దక్షిణ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నష్టం జరిగేలా ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పోతిరెడ్డి ప్రాజెక్టు సామర్ధ్యాన్ని పెంచుతూ రాయలసీమ కోసం ఎత్తిపోతల ద్వారా నీటిని మళ్లించాలని తీసుకున్న నిర్ణయంపై దక్షిణ తెలంగాణ రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని వైసిపి ప్రభుత్వానికి జేఏసీ నేతలు తేల్చి చెప్పారు. జీవో 203 వల్ల దక్షిణ తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేసిన జేఏసీ నేతలు తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ వ్యవహారాన్ని పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ దక్షిణ తెలంగాణా రైతులను పట్టించుకోరా ?
సీఎం కేసీఆర్ దక్షిణ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రినా లేక ఉత్తర తెలంగాణకు మాత్రమే ముఖ్యమంత్రినా అంటూ వారు ప్రశ్నించారు.గోదావరి నీటిని ఉత్తర తెలంగాణకు, కృష్ణా నీటిని రాయలసీమకు తరలించుకుపోతే దక్షిణ తెలంగాణ రైతాంగం పరిస్థితి ఏంటి అంటూ సీఎం కేసీఆర్ ను వారు నిలదీశారు.దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుంటే అవేవీ పట్టనట్టుగా సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకున్నారని, కుర్చీ వేసుకుని కూర్చుని మరి పాలమూరు ప్రాజెక్టు కట్టిస్తాం అన్న కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నారని జెఎసి నేతలు ప్రశ్నించారు.
సీఎం జగన్ ను హైదరాబాద్ లో తిరగనివ్వమని జేఏసీ వార్నింగ్
దక్షిణ తెలంగాణ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని సీఎం జగన్ మోహన్ రెడ్డిని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్ లో ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని తిరగనివ్వం అని వార్నింగ్ ఇచ్చారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ నేతలు, ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకోకపోతే వారిని కూడా బయట తిరిగి ఇవ్వమని జెఎసి నేతలు తేల్చి చెబుతున్నారు.
కృష్ణా వార్ బోర్డుకు వినతి పత్రం ఇచ్చిన దక్షిణ తెలంగాణా జేఏసీ , ఓయూ జేఏసీ నేతలు
దక్షిణ తెలంగాణ రైతాంగ సమస్యలను పట్టించుకోని టిఆర్ఎస్ పార్టీ ని ఒక డ్రామా పార్టీ గా వారు అభివర్ణించారు. ఇక కృష్ణ వాటర్ బోర్డుకు సైతం దక్షిణ తెలంగాణ రైతాంగ సమస్యలను తెలియజేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విషయంలో ఏపీ నిర్ణయాన్ని అమలుకాకుండా ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఇక నిన్న కృష్ణా బోర్డు ఏపీ, తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నేపధ్యంలో కీలక భేటీ నిర్వహించింది . కానీ పోతిరెడ్డి పాడు విషయంలో ఏ నిర్ణయం తీసుకోకపోవటం గమనార్హం . ఇరు రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ ల డీపీఆర్ లు ఇవ్వాలని సమావేశంలో పేర్కొన్నారు. ఇక ఏపీకి కృష్ణా రివర్ బోర్డు ఆఫీసు తరలింపు వ్యవహారం కేంద్రం పరిధిలోనిది అన్నారు.