జగన్మోహినిగా సమ్మోహితులను చేసిన స్వామి.. నేడు వైభవంగా తిరు కళ్యాణ వేడుక .
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వేద పారాయణాల మధ్య ఘనంగా జరుగుతున్నాయి. వివిధ అలంకరణలలో స్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. బ్రహ్మోత్సవాల మహా ఘటానికి యాదాద్రి సిద్ధం అవుతుంది. స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవానికి యాదాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది . ఏడు రోజులు పూర్తి చేసుకున్నబ్రహ్మోత్సవాలలో స్వామి ఏదో రోజున జగన్మోహినిగా దర్శనమిచ్చి అందరినీ సమ్మోహితులను చేశారు.ఇక రాత్రి వేళ అశ్వవాహన సేవలో స్వామి యాదాద్రి గుట్టపై ఊరేగారు. ఆ దివ్య మంగళ రూపాన్ని చూడటానికి భక్తులు విశేషంగా తరలి వచ్చారు .

జగన్మోహినీ అలంకరణలో సమ్మోహితులను చేసిన నారసింహుడు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు గురువారం స్వామివారు జగన్మోహిని అవతార అలంకార సేవలో అశ్వవాహన రూఢుడై భక్తులను పులకింపచేశారు. ఉ. 11 గంటలకు స్వామివారికి జగన్మోహినిగా అలంకార సేవ, రాత్రి 9 గంటలకు ఆశ్వవాహన సేవలను శాస్తయ్రుక్తంగా నిర్వహించారు. క్షీరసాగరమథనంలో ఉద్భవించిన అమృతాన్ని లోకహితం కోసం రాక్షసులకు అందకుండా చేసేందుకు జగన్మోహిని రూపం దాల్చిన శ్రీమహావిష్ణువు సుర, అసురులను సమ్మోహనం చేసి యోగ్యులైన దేవతలకు అమృతాన్ని అందించారు. జగన్మోహిని రూపంలో అలంకృతులైన లక్ష్మీనరసింహుడు ధర్మానుసారం నడిచేవారికి అండగా ఉంటానంటూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధానార్చకులు నందీగల్ నరసింహాచార్యులు, కారంపుడి నరసింహాచార్యులు, యాజ్ఞికులు శ్రీనివాసాచార్యులు అలంకార సేవలను నిర్వహించి వాటి విశేషాలను భక్తులకు వివరించారు.

అట్టహాసంగా సాగిన ఎదురుకోలు ఉత్సవం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనరసింహుల తిరుకళ్యాణోత్సవ ఘట్టానికి ముందుగా జరిపే ఎదుర్కోలు ఘట్టాన్ని బాల ఆలయంలో రాత్రి శాస్త్రోక్తంగా సంబరంగా నిర్వహించారు. లక్ష్మీనరసింహుడు పెండ్లికొడుకుగా ముస్తాబై అశ్వవాహనంపై మండపానికి చేరుకోగా, క్షీర సముద్ర తనయ అమ్మవారు లక్ష్మీదేవి ముత్యాల పల్లకిలో మండపానికి చేరారు. అనంతరం ఎదుర్కోలు ఘట్టంలో యాజ్ఞికులు, అర్చక పండితులు, పారాయణులు, అధికారులు వధూవరుల తరుపున రెండు బృందాలుగా ఏర్పడి స్వామి, అమ్మవార్ల పెళ్లిచూపులు, ప్రవర, వివాహ నిశ్చితార్థం, ముహూర్త నిశ్చయం, లగ్నపత్రిక రాసుకునే ప్రక్రియలను సంబరంగా నిర్వహించారు. ఎదుర్కోలు ఘట్టంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునిత మహేందర్రెడ్డి, ఈవో గీత, ధర్మకర్త బి.నరసింహమూర్తి, భక్తులు పాల్గొన్నారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. స్వామివారి సన్నిధిలో జరిగిన భక్తి సంగీత కార్యక్రమాలు . భగవానుడి లీలను ప్రదర్శిస్తూ సాగిన శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. చిన్నారులు అద్భుతమైన ప్రదర్శనలను ఇచ్చారు. కూచిపూడి నృత్య ప్రదర్శన ఆహుతులను అలరించింది .

నేడు తిరు కల్యాణోత్సవం
యాదాద్రి లక్ష్మీనరసింహుడి బ్రహోత్మవాల్లో నేడు శుక్రవారం ఎనిమిదవ రోజున బాలాలయంలో ఉదయం 10గంటలకు స్వామివారికి శ్రీరామ అలంకార సేవ, హనుమత్ వాహన సేవ, గజవాహన సేవలు నిర్వహిస్తారు. 11 గంటలకు బాల ఆలయంలోనే తిరుకల్యాణోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారం వైభవంగా నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారి కల్యాణోత్సవానికి సీఎం కేసీఆర్ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించాల్సివుంది. అయితే ఎన్నికల నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ దంపతులు ఈ దఫా కల్యాణోత్సవానికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు అందించనున్నారు. ఇప్పటికే యాదగిరీశుడి కల్యాణానికి తిరుమలేశుడి తరుపున ఏటా టీటీడీ అందించే పట్టువస్త్రాలు ఒకరోజు ముందుగానే అందించారు. తిరుకల్యాణోత్సవం పిదప రాత్రి 8 గంటలకు భక్తుల సందర్శనార్ధం కొండ దిగువన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహావైభవోత్సవ కళ్యాణం నిర్వహించనున్నారు.

స్వామి కళ్యాణానికి హాజరుకానున్న గవర్నర్ దంపతులు .. పట్టు వస్త్రాల సమర్పణ
నేడు స్వామివారి కళ్యాణ వేడుకలకు గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవదేవుల కోసం పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సీఎం, సంబంధితమంత్రులు తీసుకురావడం సంప్రదాయం. ఈ మేరకు కేసీఆర్ దంపతులు ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉన్నా ఎన్నికల కోడ్ సీఎం పర్యటనకు అడ్డుగా మారింది. దీంతో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు బాలాలయంలో స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవానికి విచ్చేసి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. భక్తుల కోసం రాత్రిపూట కొండకింద వైభవోత్సవ కల్యాణ వేడుకను అంగరంగ వైభవంగా జరుపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కొండకింద బస్టాండ్కు ఎదురుగా ఉన్న పాత జడ్పీ హైస్కూల్ ఆవరణలో ఐదువేల మంది భక్తులు కూర్చుని వేడుకను తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కళ్యాణ మహాఘట్టానికి వివిధ పుష్పాలంకరణలతో మండపాన్ని తీర్చిదిద్దుతున్నారు . అలాగే విద్యుత్ దీపాలంకరనలహో దేదీప్యమానంగా కళ్యాణ ఘట్టానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎక్కడ ఉన్నా కళ్యాణం తిలకించేలా యాదాద్రి క్షేత్రంపై స్క్రీన్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు స్వామి కళ్యాణానికి విశేషంగా తరలివచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు .












Click it and Unblock the Notifications