థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు రెడీ: అధికారులతో మంత్రి హరీశ్ రావు సమీక్ష
కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సూచించారు. దేశంలో కేరళ, మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్నాయని, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అధికారులకు సూచించారు. కొత్త వేరియంట్ వ్యాప్తి, ప్రభావం ఎప్పటికపుడు గమనిస్తూ ఉండాలన్నారు. దీనిపై రోజు వారీ పరిశీలన చేసేందుకు ప్రత్యేకంగా కమిటీ నియమించాలని ఆదేశించారు.అదీ నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వేరియంట్, మూడో వేవ్ సన్నద్ధతపై ఇవాళ బిఆర్కే భవన్లో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో సీఎస్ సోమేష్ కుమార్, హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, డీఎంఈ రమేష్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడిసి ఎండి చంద్ర శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ దేశాల్లో కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వ్యాప్తి, రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, మూడో వేవ్ సన్నద్ధత ప్రణాళిక గురించి అధికారులు మంత్రికి వివరించారు.

కొత్త వేరియంట్ రూపంలో మూడో వేవ్ ప్రమాదం వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు. 21 లక్షల హోం ఐసోలేషన్ కిట్లు సిద్దం చేయాలన్నారు. 545 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సదుపాయం కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 27,996 పడకలకు గానూ 25,826 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించడం పూర్తి అయ్యిందని, మిగతా పడకలకు వేగంగా ఆక్సిజన్ సౌకర్యం కల్పించాలన్నారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్లో మందుల నిల్వలను నిర్వహించాలని సూచించారు.
ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదన్నారు. ప్రభుత్వాలకు తోడుగా, ప్రజలు వారి బాధ్యతలు నిర్వర్తించ వలసి ఉంటుందన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ వేగాన్ని మరింత పెంచడం జరిగిందని అధికారులు వివరించారు. రెండో డోసుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పక్కగా పాటించాలని, మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం తప్పక పాటించాలని హరీష్ రావు సూచించారు.












Click it and Unblock the Notifications