మెట్రో జర్నీకి పెరిగిన ఆదరణ..! ఇక ప్రతి 4 నిమిషాలకు ఓ ట్రైన్..!!
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోకు మామూలు ఆదరణ పెరగలేదు. ఎవరు చూసినా మెట్రో ప్రయణం హాయిగా ఉందంటూ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు, విద్యార్థులే కాకుండా మియాపూర్ నుండి ఎల్బీ నగర్ వంటి దూర ప్రయాణం చేసే సాధారణ ప్రయాణీకులు కూడా మెట్రో జర్నీ వైపు మొగ్గు చూపుతున్నారు. వేగవంతమైన ప్రయాణం, ప్రధానంగా ట్రాఫిక్ సమస్యల ఊసే ఉండక పోవడం, అంతకన్నా ముఖ్యమైంది కాలుష్య రహిత ప్రయాణం కాబట్టి అన్ని వర్గాల వారు మెట్రో ప్రయాణానికి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
పెరిగిన రద్దీ ని దృష్టిలో ఉంచుకుని అదికారులు మెట్రో రైల్ సౌకర్యాన్ని మరింత మెరుగు పరిచారు. ఇంతకు ముందు ప్రతి తొమ్మిది నిమిషాలకు ఒక మెట్రో అందుబాటులో ఉండగా ఇప్పుడు దాన్ని మరింత సరళతరం చేసారు. దీంతో మెట్రో రైల్ కోసం ఎక్కువసేపు ఎదురు చూడకుండా సమయాన్ని ఆదా చేసుకోవచ్చని నగర ప్రయాణీకులు భావిస్తున్నారు.
హైదరాబాద్లో మెట్రో ప్రయాణికుల సంఖ్య క్రమంగా ఊపందుకుంది. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా నిమిషాల్లో సరైన సమయానికి గమ్యాన్ని చేరుస్తుండడంతో నగర వాసులు ముఖ్యంగా ఉద్యోగులు మెట్రో వైపే మొగ్గు చూపుతున్నారు.

ఇక హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం ఎల్బీనగర్ నుంచి మియాపూర్, నాగోల్ నుంచి హైటెక్ సిటీకి ఇలా రెండు కారిడార్ లలో నడుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మరీ ముఖ్యంగా అమీర్ పేట నుంచీ హైటెక్ సిటీకి రోజూ వేలాదిమంది ఐటీ ఉద్యోగులు ప్రయాణిస్తుంటారు. కాగా ఇప్పటి వరకు జూబ్లీ చెక్పోస్టు నుంచి హైటెక్ సిటీ వరకు సింగిల్ లైన్ ద్వారా రైళ్లు నడవగా, ఇప్పుడు ఈ రూట్ లో మెట్రో అధికారులు రివర్సల్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ఇక నుంచి అమీర్పేట నుంచి హైటెక్సిటీ వరకు ప్రతి 4 నిమిషాలకు ఒక మెట్రో రైలు నడవనుంది.
ఎల్బీనగర్ నుంచి మియాపూర్ కారిడార్లో ప్రతి 5 నిమిషాలకు ఒక రైలు అందుబాటులోకి రానుంది.హైటెక్ సిటీ - అమీర్పేట కారిడార్లో 2, 3 వారాల పాటు ప్రతి 4 నిమిషాలకు ఒక రైలు నడవనుంది. ఆ తర్వాత పరిస్థితుల ఆధారంగా ప్రతి 3 నిమిషాలకు కూడా ఒక రైలును అదికారులు నడపనున్నారు. దీనిపై కసరత్తు చేస్తున్నారు మెట్రో అదికారులు.












Click it and Unblock the Notifications