ఎర్రబస్సు మాత్రమే తెలుసు: తెలుగు ప్రజలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Recommended Video

హైదరాబాద్: తెలుగు ప్రజలపై కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ ప్రజలకు రైల్వే అలవాటు లేదని, అసలు రైలు అంటే తెలియదని అన్నారు.

ఎర్రబస్సులు మాత్రమే తెలుసంటూ..
అంతేగాక, ఆంధ్ర, తెలంగాణ ప్రజలకు ఎర్రబస్సులు తప్ప రైల్వే అంటే తెలియదని కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాకే తెలుగు రాష్ట్రాల్లో అనేక కొత్త రైళ్లు ప్రారంభించారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని 427 రైల్వే స్టేషన్లలో హైస్పీడ్ వైఫై సౌకర్యం కల్పించారని చెప్పారు.

తలసానికి కౌంటర్ ఇచ్చే క్రమంలో..
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు అభివృద్ధి పనులకు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ చర్లపల్లి స్టేషన్లో శాటిలైట్ టెర్మినల్ నిర్మాణం సహా గుంతకల్లు-నంద్యాల మధ్య ఎలక్ట్రిక్ డబుల్ లైన్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. తెలంగాణకు కొత్త రైల్వేలు కేటాయించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే తలసానికి కౌంటర్ ఇచ్చే క్రమంలో కిషన్ రెడ్డి ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా, కిషన్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. టీఆర్ఎస్ తోపాటు ఇతర రాజకీయ పార్టీలు కిషన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు.
కాగా, విమర్శల నేపథ్యంలో కిషన్ రెడ్డి వెనక్కి తగ్గారు. తాను ప్రజలను కించపర్చాలనే ఉద్దేశంతో వ్యాఖ్యలు చేయలేదని, వెనుకబాటు తనంపైనే వ్యాఖ్యానించానని చెప్పుకొచ్చారు.

సీఏఏపై నష్టం లేదంటూ..
ఇది ఇలా ఉండగా, యూసఫ్ గూడలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఏఏతో ఎవరికి నష్టమో సీఎం కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. పార్లమెంటులో ఆమోదం పొందిన సీఏఏను తెలంగాణ సర్కారు ఎలా వ్యతిరేకిస్తుందని నిలదీశారు. దేశ ప్రగతి కోసం కృషి చేస్తున్న ప్రధాని మోడీపై అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఏఏతో ఏ భారతీయుడికీ నష్టం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే సీఏఏపై అవగాహన కల్పించేందుకు భారీ బహిరంగ నిర్వహిస్తామని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని చెప్పారు.












Click it and Unblock the Notifications