ఓటమిపై ఎట్టకేలకు పెదవి విప్పిన ఉత్తమ్.. ఇంకా కాంగ్రెస్లో కొనసాగుతున్న కన్ఫ్యూజన్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి కారణాలేంటి? చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకి కలిసిరాలేదా? ఎన్నికలు జరిగి ఇన్నిరోజులు గడుస్తున్నా.. పార్టీలో అంతర్గతంగా సమీక్ష చేయకపోవడానికి కారణాలేంటి? ఇలాంటి ప్రశ్నలకు చెక్ పెడుతూ ఎట్టకేలకు మౌనం వీడారు టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పలు అంశాలపై మాట్లాడిన ఉత్తమ్.. పనిలోపనిగా సీఎం కేసీఆర్ తో పాటు ఎన్నికల సంఘం తీరును తప్పుబట్టారు.
ఓటమికి ఎన్నో కారణాలు..!
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి సంబంధించి ఎట్టకేలకు స్పందించారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఎన్నో కారణాలున్నాయని వెల్లడించారు. పార్టీ అభ్యర్థులతో మాట్లాడి రెండు మూడు రోజుల్లో ఓటమిపై సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. తద్వారా రానున్న లోక్సభలో మంచి ఫలితాలు సాధించేలా ప్లాన్ చేస్తామన్నారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లు, లెక్కకొచ్చిన ఓట్ల మధ్య చాలా వ్యత్యాసం ఉందని ఆరోపించారు. ఒక్క శాతం ఓట్ల తేడా ఉన్న ధర్మపురి, కోదాడ, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్లలో వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించలేదని ఫైరయ్యారు. మంచిర్యాలలో సాయంత్రం 4 గంటల తర్వాత వేల సంఖ్యలో ఓట్లు పోల్ కావడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలపై స్టేట్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసినా స్పందన లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పొత్తు లేటయింది.. చంద్రబాబు తప్పులేదు
మహాకూటమి పొత్తులపై మాట్లాడిన ఉత్తమ్.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారంతో కాంగ్రెస్ కు ఎలాంటి నష్టం జరగలేదని వ్యాఖ్యానించారు. పొత్తుల వల్లే మహాకూటమి విఫలమైందనే వాదన సరికాదని చెప్పారు. అలయెన్స్ విషయంలో కాస్తా ముందుగా నిర్ణయం తీసుకుంటే ప్రతికూల ఫలితాలు వచ్చేవి కావని తెలిపారు. పనిలోపనిగా సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి రోజులు గడుస్తున్నా.. ఇప్పటివరకు అసెంబ్లీని సమావేశపరచకపోవడం సరికాదన్నారు.
పొత్తు కొనసాగింపు ఉంటుందా?
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి సంబంధించి ఢిల్లీ పెద్దలకు ప్రాథమిక నివేదిక ఇచ్చామన్నారు ఉత్తమ్. రెండు మూడు రోజుల్లో కుంతియాతో భేటీ అవుతామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లామని.. ఎక్కడా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని చెప్పుకొచ్చారు. మహాకూటమి పొత్తు కొనసాగింపుపై అధిష్టానంతో మాట్లాడి నిర్ణయిస్తామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటానికి సిద్ధమవుతోందని తెలిపారు.