తెలంగాణ కాంగ్రెస్లో మరో బిగ్ వికెట్: కీలక నేత గుడ్బై: ప్రాథమిక సభ్యత్వానికీ: సోనియాకు లేఖ
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో మరో బిగ్ వికెట్ పడింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యంత దారుణంగా పరాజయంపాలు కావడం ఆ పార్టీని పీడకలలా వెంటాడుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో కనీస పోటీని ఇవ్వలేకపోయిన ఫలితం..ఆ పార్టీ నేతలపై పడుతోంది. రెండో స్థానం కాదు కదా.. కనీసం ఖాతా తెరవడానికే మల్లగుల్లాలను పడాల్సి వచ్చిన పరిస్థితులు రాజీనామాలకు దారి తీస్తున్నాయి. వికెట్ల మీద వికెట్లు పడటానికి కారణమౌతున్నాయి.

ఉత్తమ్ రాజీనామా
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలు కావడానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నైతిక బాధ్యత వహించారు. తన పదవికి రాజీనామా చేశారు. తన పదవికి రాజీనామా చేసిన కొద్దిరోజులకే.. మరో కీలక నేత గుడ్బై చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ కోశాధికారి గూడూర్ నారాయణ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. పార్టీలోని అన్ని పదవులకూ రాజీనామా చేశారాయన. పీసీసీ కోశాధికారి పదవితో పాటు అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి, తన ప్రాథమిక సభ్యత్వానికీ గుడ్బై చెప్పారు. తన రాజీనామా లేఖను సోనియాగాంధీకి పంపించారు.

1981లో విద్యార్థిదశ నుంచీ..
1981లో తాను విద్యార్థిదశలో ఉన్నప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వాన్ని తీసుకున్నానని, చిత్తశుద్ధి గల సైనికుడిలా పార్టీని అభివృద్ధి చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేశానని గూడూర్ నారాయణ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. పార్టీ అధిష్ఠానం తనపై విశ్వాసం ఉంచి అనేక బాధ్యతలు, పదవులను అప్పగించిందని, వాటిని తాను వందశాతం నిర్వర్తించానని వివరించారు. ప్రతి స్థాయిలోనూ అధిష్ఠానం తన కష్టాన్ని గుర్తించిందని, అందుకే పీసీసీ కోశాధికారి పదవి స్థాయికి ఎదిగానని ఆయన చెప్పుకొచ్చారు. తనకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సోనియాగాంధీకి కృతజ్ఙతలు తెలిపారు.

అనివార్య కారణాల వల్ల
ఇప్పుడు అనివార్య కారణాల వల్ల తాను కోశాధికారి పదవికి, ఏఐసీసీ సభ్యత్వం నుంచి తప్పుకొంటున్నాని చెప్పారు. ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. తన రాజీనామా పత్రాన్ని ఆమోదించాలని విజ్ఙప్తి చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సంభవించిన ఓటమి వల్లే ఆయన రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. పార్టీలో క్రమశిక్షణ గల నాయకత్వం కొరవడిందని, సమర్థుడైన నాయకుడికి పీసీసీ పగ్గాలను అప్పగించాల్సిన అవసరం ఉందని గూడూర్ నారాయణ రెడ్డి అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు.
Recommended Video

నాయకత్వ లోపం వల్లే..
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు డివిజన్లకే పరిమితమైన విషయం తెలిసిందే. ఏఎస్ రావు నగర్, ఉప్పల్ డివిజన్లలో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో పరాజయాన్ని చవి చూసిన సందర్భం ఇదివరకెప్పుడూ లేదు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. మల్కాజ్గిరి లోక్సభ సభ్యుడు రేవంత్ రెడ్డి లేదా కోమటిరెడ్డి వెంకట రెడ్డిలకు అప్పగిస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సమర్థుడైన నాయకుడికి పీసీసీ పగ్గాలను అప్పగిస్తేనే.. పార్టీ మళ్లీ గాడిన పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.












Click it and Unblock the Notifications