అడ్డంగా దొరకిన బీజేపీ: కాపీ కొట్టడానికీ తెలివుండాలన్న కేటీఆర్ -కాషాయ మేనిఫెస్టోలో గులాబీ ఘనత
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో.. వివాదాస్పద ఎల్ఆర్ఎస్ రద్దు మొదలుకొని, హైదరాబాద్ నగరంలోని వరద బాధిత కుటుంబాలకు తలా రూ.25వేలు, కొత్తగా లక్ష ఇళ్లు, 100 యూనిట్లలోపు వాడితే ఉచిత కరెంటు, మూసీ ప్రక్షాళన, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం.. ఇలాంటి బోలెడు హామీలను బీజేపీ తన మేనిఫెస్టోలో హామీలుగా ఇచ్చింది. అయితే, అనూహ్యరీతిలో ప్రత్యర్థి టీఆర్ఎస్ కు అడ్డంగా దొరికిపోయినట్లయింది. దీనిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విటర్ లో కామెంట్లు చేశారు.

అసలేం జరిగిందంటే..
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుతామనే హామీతోపాటు దాదాపు 20 అంశాలతో బీజేపీ గ్రేటర్ మేనిఫెస్టోను గురువారం విడుదల చేసింది. అయితే, సిటీని ఈవిధంగా అభివృద్ది చేస్తామని సూచిస్తూ బీజేపీ మేనిఫెస్టోలో ప్రచురించిన ఫొటోలు చర్చనీయాంశం అయ్యాయి. ప్రధానంగా ‘హైదరాబాద్ నలువైపులా డంపింగ్ యార్డులు' అన్న బీజేపీ హామీకి.. టీఆర్ఎస్ అభివృద్ధిచేసిన జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఫొటోను, ‘కొత్త మహిళా పోలీస్ స్టేషన్లు'అనే హామీకి ప్రస్తుతం కొనసాగుతున్న పీఎస్ ల ఫొటోలను బీజేపీ వాడుకుంది. టీఆర్ఎస్ అభివృద్ధి పనులకు మార్కుగా నిలిచిన సదరు ఫొటోలను బీజేపీ మేనిఫెస్టోలో వాడటంపై గులాబి శ్రేణులు కామెంట్లు చేయగా, మంత్రి కేటీఆర్ సైతం రంగంలోకి దిగారు.

ప్రియమైన బీజేపీ రచయితలారా..
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విటర్లో స్పందించారు. టీఆర్ఎస్ అభివృద్ధి కార్యక్రమాల ఫొటోలతో బీజేపీ మేనిఫెస్టో రూపొందించడంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీఆర్ఎస్ అభివృద్ధి కార్యక్రమాలైన షీ-టాయిలెట్స్, డంపింగ్ యార్డు, మహిళా పోలీస్స్టేషన్ ఫొటోలను బీజేపీ మేనిఫెస్టోలో వాడుకోవడాన్ని కాంప్లిమెంట్ గా భావిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. అంతటితో ఆగకుండా..

నకల్ కొట్టడానికి అకల్ ఉండాలె
‘‘టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనుల ఫొటోలను మీ(బీజేపీ) మేనిఫెస్టోలో పెట్టుకోవడాన్ని కాంప్లిమెంట్గా తీసుకుంటాం. ఈ సందర్భంగా నాకు హైదరాబాదీ సామెత గుర్తుకొస్తోంది.. నకల్ మార్నేకేలియే బీ అకల్ చాహియే (కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలి). టీఆర్ఎస్ కు సంబంధించినత వరకైతే, గతంలో ఏం చేశామో, ఇప్పుడేం చేయబోతున్నామో స్పష్టంగా మేనిఫెస్టోలో చెప్పాం. ఐదేళ్లలో తెలంగాణలో ఏం జరిగిందో ఆలోచించండి..'' అని కేటీఆర్ పేర్కొన్నారు.

కేసీఆర్ సింహం.. వాళ్లు టూరిస్టులు..
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ గురువారం రాత్రి ఆనంద్ బాగ్ అంబేద్కర్ నగర్ చౌరాస్తాలో రోడ్ షో నిర్వహించారు. ‘‘సీఎం కేసీఆర్ సింహంలాంటి వారు.. సింగిల్గానే వవస్తారు. హైదరాబాద్ కుగానీ, తెలంగాణకుగానీ ఏ సమస్య వచ్చినా చూసుకునేది ఆయనే. అదే బీజేపీ నేతలు మాత్రం ఎక్కడెక్కడి నుంచో డజన్ల కొద్దీ వచ్చిపడుతున్నారు. ఇలాంటి పొలిటికల్ టూరిస్టులతో హైదరాబాద్ నగరానికి ఒరిగేదేమీ లేదు. మొన్న వరదలు వచ్చినప్పుడు ఏ ఒక్క నాయకుడు హైదరాబాద్ వైపు కన్నెత్తి చూడలేదేం? పైగా, సీఎం కేసీఆర్ వరద సాయం చేస్తుంటే, ఇదే బీజేపీ నేతలు అడ్డుకున్నారు. మతం పేరుతో చిచ్చు పెట్టేవాళ్లు కావాలా..? జనహితం కోరుకునేవాళ్లు కావాలా? తేల్చుకోవాలి'' అని మంత్రి కేటీఆర్ అన్నారు.
Dear BJP manifesto writers,
— KTR (@KTRTRS) November 26, 2020
Glad that you chose pictures of the work done by TRS Govt in your GHMC manifesto
We will take this as a compliment to our work
But let me remind you what they say in Hyderabad
नकल मारने को भी अकल चाहिए। 😀
కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలె https://t.co/guN76K5N7n












Click it and Unblock the Notifications