రెచ్చగొట్టి సమ్మె! కేసీఆర్ ధనదాహంతో ఆర్టీసీకి రూ.1500 కోట్ల నష్టం: లెక్క చెప్పిన రేవంత్
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టి సమ్మె చేయించారని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. సోమవారం సాయంత్రం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ నిర్ణయాల వల్లే..
గోల్డ్ స్టోన్ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని ఎలక్ట్రిక్ బస్సులను తెచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీని నష్టాల ఊబిలోకి నెట్టారని రేవంత్ మండిపడ్డారు. సర్కారు నిర్ణయాల వల్లే ఆర్టీసీ నష్టాలబాట పట్టిందని మండిపడ్డారు.

పన్నును భారీగా పెంచారు
ఆర్టీసీ ఉపయోగించే డీజిల్పై ఇంతకుముందు 22.5శాతం ఉన్న వ్యాట్ను కేసీఆర్ సర్కారు 27శాతానికి పెంచిందని రేవంత్ చెప్పారు. దీంతో ఆర్టీసీపై వందలకోట్ల భారం పడిందని అన్నారు. డీజిల్పై విధించే పన్నులో 15శాతం కేంద్రానికి, 27శాతం రాష్ట్ర ప్రభుత్వానికి పోతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న 27శాతం పన్నుతో ఆర్టీసీపై ఏడాదికి రూ. 750 కోట్ల అదనపు భారం పడుతోందని చెప్పారు.

ధనవంతులకేమో తగ్గించారు..
ధనవంతులు ప్రయాణించే విమానాల ఇంధనంపై 16శాతం ఉన్న వ్యాట్ను కేసీఆర్, కేటీఆర్లు కలిసి దాన్ని 1 శాతానికి తగ్గించారని ఆరోపించారు. ఇది జీఎంఆర్ సంస్థకు లాభం చేస్తుందని, ఈ తండ్రీకొడుకుల నిర్ణయం వల్ల రాష్ట్రానికి రూ. 300-500 కోట్ల నష్టం వస్తోందని రేవంత్ ధ్వజమెత్తారు.

ఆర్టీసీకి 850 కోట్ల పన్నుపోటు..
అదే పేద ప్రజలకు సేవలందిస్తున్న ఆర్టీసీపై 27శాతం విధిస్తున్న పన్నును 1శాతానికి తగ్గిస్తే ఆర్టీసీకి 700కోట్లకుపైగా నిధులు మిగులుతాయని, దాంతో కొత్త బస్సులు కొనడం జరుగుతుందని, అలాగే ఆర్టీసీకి నష్టం కూడా ఉండదని అన్నారు. అంతేగాక, ఆర్టీసీ కొనుగోలు చేసే వాహనాల స్పేర్ పార్ట్స్పైనా 100-150శాతం పన్నును రాష్ట్ర ప్రభుత్వం విధిస్తోందని అన్నారు. ఈ విధంగా ఆర్టీసీ నుంచి 850 కోట్ల పన్నును కేసీఆర్ సర్కారు వసూలు చేస్తోందని తెలిపారు.

సబ్సిడీతో మరో 700 కోట్ల భారం..
ఇక వికలాంగులకు, విద్యార్థులకు పాస్ రూపంలో సర్కారు సబ్సిడీలను ఇస్తోందని, ఇది కూడా ఆర్టీసీపై భారమేనని అన్నారు. సబ్సిడీ ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ మొత్తాన్ని ఆర్టీసికి చెల్లించకపోవడంతో ఆర్టీసీపై పెను భారం పడుతోందని అన్నారు. ఈ సబ్సిడీ కింద ప్రతి ఏడాది ఇవ్వాల్సిన సుమారు రూ. 700 కోట్లను కూడా కేసీఆర్ సర్కారు ఇవ్వడం లేదని మండిపడ్డారు. అందుకే ఆర్టీసీ దివాలా తీస్తోందని అన్నారు.

ధన దాహంతో 1500 కోట్ల భారాన్ని మోపిన కేసీఆర్ సర్కారు
పన్నుల రూపంలోనే ఆర్టీసీపై సుమారు రూ. 1500 కోట్ల భారాన్ని కేసీఆర్ సర్కారు మోపుతోందని రేవంత్ వ్యాఖ్యానించారు. ఈ భారీ అదనపు భారంతో ఆర్టీసీ నష్టాలబాట పడుతోందని వివరించారు. సర్కారు నిర్ణయాల వల్లే ఆర్టీసీ ప్రతి ఏడాది రూ. 1400కోట్లు నష్టపోతోందని ఆరోపించారు. కేసీఆర్ ధనదాహం కారణంగానే ఆర్టీసీపై అదనపు పన్నులు అని అన్నారు.












Click it and Unblock the Notifications