ఎవరికీ ఇచ్చినా ఓకే, కలిసి పనిచేస్తాం: శ్రీధర్ బాబు.. బీసీలకే ఇవ్వాలంటోన్న వీహెచ్
తెలంగాణలో పీసీసీ చీఫ్ పదవీ కాక రేపుతోంది. కొత్త నేతపై కసరత్తు జరుగుతోంది. వాస్తవానికి ఎంపిక జరిగింది.. ప్రకటించడమే తరువాయి అనే ప్రచారం జరుగుతోంది. కానీ సోనియా గాంధీ మాత్రం సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్నారు. ఈ క్రమంలో కలిసి పనిచేస్తామని కొందరు నేతలు అంటుండగా.. బీసీలకే అని మరో వాయిస్ వినిపిస్తోంది. అయితే ప్రధానంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్యే పోటీ నెలకొంది. వీరిద్దరూ అగ్ర కులాలకు చెందినవారు కాగా.. బీసీ కార్డు అనేది ఉండదు. దీంతో బీసీలకే ఇవ్వాలని పట్టుబట్టడంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ కొనసాగుతోంది.
కలిసి పనిచేస్తాం..
పీసీసీ అధ్యక్ష పదవీ హైకమాండ్ ఎవరికి ఇచ్చినా కలిసి పని చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీధర్బాబు అన్నారు. సిద్దిపేట తాడుర్ బలాగౌడ్ పంక్షన్ హాల్లో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చడానికే కేంద్రం వ్యవసాయ చట్టాలు తెచ్చిందని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు మూడో తరానికి అందించే విధంగా టీఆర్ఎస్ పాలన ఉందని వ్యాఖ్యానించారు.
10 వేలకు.. రెండు వేలే
సీఎం సొంత జిల్లా, మంత్రి హరీశ్రావు నియోజకవర్గం సిద్దిపేటలో డబుల్ బెడ్రూం ఇళ్లకు 10 వేల దరఖాస్తులు వస్తే ఏడేళ్లలో రెండు వేలు మాత్రం ఇచ్చారన్నారు. మిగిలిన వారికి ఎప్పుడు ఇస్తారని అడిగారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష ఇళ్లు కట్టిస్తామని చెప్పిన కేటీఆర్.. ఎన్ని కట్టించారని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతిపై కూడా విధాన పరమైన నిర్ణయం తీసుకోలేదని ఆరోపించారు.
Recommended Video
బీసీలకే ఇవ్వాలి
పీసీసీ చీఫ్ పదవీ ఈసారి బీసీలకు అవకాశం ఇవ్వాలని హైకమాండ్ను వీ హనుమంతరావు కోరారు. బీసీలు పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడే పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీలకు ఇస్తేనే న్యాయం జరుగుతుంద ని సూచించారు. పార్టీ కూడా బలపడుతుందని, రాష్ట్రంలో పుంజుకునే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వొద్దని హితవు పలికారు. నాగార్జునసాగర్లో జానారెడ్డి చెప్పిన వారికే టికెట్ ఇవ్వాలని పేర్కొన్నారు. గ్యాస్ ధరల పెంపుపై కేసీఆర్.. కేంద్రాన్ని నిలదీయాలని వీహెచ్ డిమాండ్ చేశారు.