ఆ రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన ఆరుగురు ప్రముఖులు ఎవరు? ఐటీదాడులతో ఆసక్తికరచర్చ!!
హైదరాబాద్: తెలంగాణా రాష్ట్రంలో తాజాగా జరిగిన ఐటీ దాడులు కలకలంగా మారాయి. పన్ను ఎగవేత ఆరోపణలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్, మరియు సుమధుర కన్స్ట్రక్షన్స్ కు సంబంధించిన కార్యాలయాలపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు బుధవారం నుండి దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడులలో వారు కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఆయా సంస్థలలో పెట్టుబడులు పెట్టిన ఆరుగురు ప్రముఖుల డేటా సేకరిస్తున్నట్టు సమాచారం.
రియల్ ఎస్టేట్ గ్రూప్స్ పై ఐటీ శాఖ దాడులు
హైదరాబాద్లోని వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్ కంపెనీ ప్రధాన కార్యాలయంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని 10 చోట్ల ఐటీ శాఖ ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో వారి ప్రాజెక్టులకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 20 మంది ఐటి అధికారుల బృందం హైదరాబాద్లోని వాసవి గ్రూప్ ప్రధాన కార్యాలయంలో సోదాలు చేసింది. కంపెనీకి చెందిన వాసవి రియల్టీ, వాసవి నిర్మాణ్, శ్రీ ముఖ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, ఇండ్మాక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు వాసవి వెంచర్స్కు సంబంధించిన అన్ని పత్రాలను పరిశీలించింది.
వేల కోట్ల రూపాయల రియాల్టీ వెంచర్లు .. అక్రమ లావాదేవీలపై ఆరా
వేల కోట్ల రూపాయలతో భారీ రియాల్టీ వెంచర్లు, హౌసింగ్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని, అయితే ఆదాయపు పన్ను చెల్లింపులో మాత్రం అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిపినట్టు తెలుస్తుంది. వాసవి రియల్ ఎస్టేట్స్ గ్రూప్ నిర్వహించిన అక్రమ లావాదేవీలు, ఇప్పటి వరకు పూర్తయిన వాసవీ గ్రూప్ ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల వివరాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.
మధుర కన్స్ట్రక్షన్స్ .. వాసవీ రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారిపై ఆరా
ఇదిలా ఉంటే మధుర కన్స్ట్రక్షన్స్ కు సంబంధించి హైదరాబాద్, బెంగళూరులో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ రెండు సంస్థలు టాలెస్ట్ టవర్స్ నిర్మాణాల పేరుతో భారీగా వినియోగదారుల నుంచి బుకింగ్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రీ లాంచ్ పేరుతో భారీగా నగదు రూపంలో పెట్టుబడులు వసూలు చేసిన వ్యవహారంపై ఐటీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్ లో బయట వ్యక్తులు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం గురించి ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.
ఆరుగురు ప్రముఖుల వాటాలు .. వారెవరు? హాట్ టాపిక్
మొత్తం ఆరుగురు ప్రముఖుల వాటాలు ఇందులో ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే వీరు రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులా, లేక ఇతర వ్యాపార రంగాలకు సంబంధించిన ప్రముఖులా అన్నది ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ రెండు సంస్థలకు ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలతో, అధికార పార్టీ నాయకులతో ఏవైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా ఐటీ రైడ్స్ నేపథ్యంలో చర్చ జరుగుతోంది. ఒకపక్క తెలంగాణా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న సమయంలో ఐటీ దాడులు ప్రధానంగా అందరి దృష్టి పడేలా చేశాయి.