ఇన్స్టాలో పరిచయం పెళ్లి దాకా... గర్భం దాల్చడంతో అబార్షన్.. మోసపోవడంతో ఆత్మహత్య...
ఇన్స్టాగ్రామ్లో వాళ్లిద్దరికీ పరిచయం ఏర్పడింది... కొన్నాళ్లకు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది... ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి ఇంట్లో చెప్పకుండానే పెళ్లి కూడా చేసేసుకున్నారు... ఆ తర్వాత యువతి తన తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పగా... పనీ,పాట లేనివాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నాళ్లకు ఆమె గర్భం దాల్చింది. అప్పటినుంచి కథ అడ్డం తిరిగింది. భర్త ఆమెను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఇంటికెళ్లి నిలదీస్తే భర్త తల్లిదండ్రులు కూడా ఆమెనే తిట్టిపోశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.
అసలేం జరిగింది...
హైదరాబాద్ బంజారాహిల్స్లోని రాఘవేంద్ర కాలనీలో ఉన్న ఓ హాస్టల్లో దుగ్యాల ఐశ్వర్య(20) అనే యువతి ఉంటోంది. బంజారాహిల్స్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఆమె బిజినెస్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తోంది. కొన్ని నెలల క్రితం ఇన్స్టాగ్రామ్లో ఆమెకు మారెడ్డి ఆశిర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు అది కాస్త ప్రేమగా మారింది. గతేడాది ఫిబ్రవరి 20న హైదరాబాద్ శివారులోని సంఘీ దేవాలయంలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు.
ఇంటికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు...
పెళ్లి తర్వాత కొన్ని రోజులు ఇద్దరూ కలిసే ఉన్నారు. ఆ క్రమంలో తన పెళ్లి గురించి ఐశ్వర్య తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఏ పని చేయని వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు.. నిన్నెలా పోషిస్తాడని ప్రశ్నించారు. హైదరాబాద్ వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. తన భర్తకు తనను దూరం చేశారని అప్పటినుంచి తల్లిదండ్రులపై ఐశ్వర్య ఆగ్రహంతో ఉంటోంది. ఇదే క్రమంలో కొద్దిరోజులకు ఐశ్వర్య మళ్లీ హైదరాబాద్ తిరిగొచ్చింది. స్థానికంగా ఓ హాస్టల్లో ఉంటూ ఉద్యోగం కొనసాగిస్తోంది.
గర్భం దాల్చడంతో అబార్షన్...
ఐశ్వర్య వచ్చిన విషయం తెలిసి ఆశిర్ రెడ్డి మళ్లీ ఆమె వద్దకు వెళ్లాడు. ఆమెతో మళ్లీ సంబంధం కొనసాగించాడు. ఈ క్రమంలో ఐశ్వర్య గర్భం దాల్చింది. దీంతో ఇద్దరం కలిసి ఉందామని ఐశ్వర్య ఆశిర్ రెడ్డిని కోరింది. అందుకు అతను ఒప్పుకోలేదు సరికదా... ఆమెను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఇదే క్రమంలో ఐశ్వర్యకు అబార్షన్ కూడా చేయించాడు. దీంతో ఆశిర్ రెడ్డి వ్యవహారంపై ఏదో ఒకటి తేల్చాలని ఐశ్వర్య వారి ఇంటికి వెళ్లింది. అయితే అతని తల్లిదండ్రులు కూడా ఐశ్వర్యనే అవమానించారు.
మనస్తాపంతో ఆత్మహత్య...
జరిగిన పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఐశ్వర్య మంగళవారం(మార్చి 30) ఆత్మహత్యకు పాల్పడింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లోని పేయింగ్ గెస్ట్ హౌస్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు కొన్ని సెల్ఫీ వీడియోలు కూడా రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆశిర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.