పాలమూరు నేతలతో వైఎస్ షర్మిల భేటీ.. పార్టీ ఏర్పాటుపై విసృత చర్చ
తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై వైఎస్ షర్మిల వేగంగా పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పర్యటనకు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ప్రతీ వారం వివిధ జిల్లా నేతలతో వరసగా సమావేశాలు మాత్రం నిర్వహిస్తున్నారు. ఈ నెల 25వ తేదీ గురువారం పాలమూరు జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. కొత్త పార్టీ ఏర్పాటు గురించి ప్రధానంగా చర్చ జరగనుంది.
ఈ నెల 25న మహబూబ్నగర్ జిల్లా వైఎస్సార్ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తారు. జిల్లాలో పార్టీ ప్రభావం ఎంత ఉంటుందనే అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కొత్త పార్టీ ఏర్పాటుపై తెలంగాణలోని వైఎస్సార్ అభిమానులతో షర్మిల సంప్రదింపులు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరుసగా ఆయా జిల్లాల నేతలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ వస్తున్నారు.
కొత్త పార్టీ ఏర్పాటు, లక్ష్యాలకు సంబంధించిన ప్రణాళికను జిల్లా నేతలకు ఆమె వివరిస్తున్నట్లు తెలుస్తోంది. తనతో కలిసి నడిచి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న అభిమానులు, మద్దతుదారుల నుంచి షర్మిల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. వారి సలహాలు, సూచనలకు విలువ ఇచ్చి ముందడుగు వేసే అవకాశం ఉంది. తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటు అంశం చర్చకు దారితీసింది. చాలా మంది నేతలు విమర్శిస్తూ వస్తున్నారు. కొత్త పార్టీ ఏర్పాటు అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు.