దీపావళి తర్వాతే నితీశ్ ప్రమాణం: నేరచరితులు 100
పాట్నా: 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో మాహాకూటమి 178 స్ధానాల్లో విజయం సాధించగా, ఎన్డీయే కూటమి కేవలం 58 స్థానాలు మాత్రమే సాధించగలిగింది. 14 జిల్లాల్లో బీజేపీ అసలు ఖాతానే తెరవలేదు. మరో 7 స్ధానాల్లో ఇతరులు విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఆసక్తికర విషయం ఏమిటంటే విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది నేర చరితులే ఉండటం విశేషం. మహాకూటమి నుంచి 142 మంది నేరచరిత ఉన్న అభ్యర్ధులు ఎన్నికల బరిలో నిలిస్తే, వారిలో 100 మంది విజయం సాధించారు. ఇక ఎన్డీఏ విషయానికి వస్తే 139 మంది నేరచరిత ఉన్నవారు పోటీ చేస్తే వారిలో 37 మంది గెలుపొందారు.
దీనిని బట్టి చూస్తే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిపిన మొత్తం నేరచరిత అభ్యర్దుల్లో దాదాపు 27శాతం మంది విజయం సాధించారు. నేర చరిత ఉన్న నేతల్లో మథిహని నియోజకవర్గం నుంచి గెలుపొందిన నరేంద్రకుమార్ సింగ్ (జేడీయూ) 15 కేసులతో మొదటి స్థానంలో ఉన్నాడు.
దెహ్రీ స్థానం నుంచి గెలుపొందిన మహమ్మద్ ఇలియాస్ హుస్సేన్ 14 కేసులతో రెండో స్థానంలో ఉన్నారు. ఇది ఇలా ఉంటే బీహార్లో ప్రభుత్వ ఏర్పాటుకు జేడీయూ అధినేత నితీశ్ కుమార్ కసరత్తు మొదలుపెట్టారు. నితీశ్ సారధ్యంలోని మాహాకూటమి బీహార్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి నితీశ్ కుమార్ దీపావళి తర్వాత సీఎంగా ప్రమాణం చేయనున్నారు. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్లో మహాకూటమి 178 స్థానాలను కైవసం చేసుకుంది. మహాకూటమిలో భాగమైన జేడీయూ 71, ఆర్జేడీ 80, కాంగ్రెస్ 27 స్థానాలను గెలుచుకుంది. బీహార్ సీఎంగా నితీశే అని ఎన్నికల ఫలితాల అనంతరం లాలూ ప్రకటించారు.