ఢిల్లీ అసెంబ్లీలో రాత్రంతా ఆప్ ఎమ్మెల్యేల నిరసన-లెఫ్టినెంట్ గవర్నర్ పై సీబీఐ దర్యాప్తుకు డిమాండ్
ఢిల్లీలో ఆప్ ప్రభుత్వానికీ, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు మధ్య వివాదం అంతకంతకూ ముదురుతోంది. ఎల్జీ తీరుపై ఆగ్రహంగా ఉన్న ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యేలు.. నిన్న రాత్రంతా ఢిల్లీ అసెంబ్లీలోనే నిరసన కొనసాగించారు. ఉదయం ఇళ్లకు వెళ్లిన ఎమ్మెల్యేలు ఇవాళ సీబీఐని కలిసి లెఫ్టినెంట్ గవర్నర్ అవినీతిపై దర్యాప్తు కోరబోతున్నారు.
మనీలాండరింగ్ కేసులో లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాపై ఆరోపణలు చేస్తున్న ఆప్ ఎమ్మెల్యేలు.. ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాత్రంతా నిరసనకు దిగారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్పై అవినీతి కేసు పెట్టిన ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ ఆయన 'ఖాదీ స్కామ్'ను అమలు చేశారని ఆరోపించారు. 2016లో గ్రామీణ ఖాదీ బోర్డు ఛైర్మన్ గా పనిచేసిన వీకే సక్సేనా.. బీజేపీ నోట్ల రద్దు చేసిన సమయంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి ఏకంగా రూ.1400 కోట్ల పాత నోట్లను మార్పిడి చేశారని ఆప్ ఆరోపిస్తోంది. ఇందుకు ఆధారాలు కూడా ఉన్నాయంటోంది.

ఈ రూ.1400 కోట్ల మార్పిడి వ్యవహారంలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని కోరుతూ ఇవాళ ఆప్ ఎమ్మెల్యేలు సీబీఐ డైరెక్టర్ ను కలవబోతున్నారు. సీబీఐ స్పందించకపోతే న్యాయపోరాటం చేయాలని కూడా ఆప్ భావిస్తోంది. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ తో పాటు ఆయన వెనుకున్న బీజేపీ కూడా ఇరుకున పడటం ఖాయమని ఆప్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఆప్ ఎమ్మెల్యేలు సీబీఐకి ఇవ్వబోయే ఫిర్యాదు ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications