జాతీయ పార్టీగా ఆప్-ఆదుకున్న గుజరాత్-కేజ్రివాల్ కోరుకుంది ఇదేనా ?
ఢిల్లీ, పంజాబ్ లో వరుస విజయాలతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి తాజాగా జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు షాకిచ్చాయి. గుజరాత్ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన ఆప్ .. చివరికి ఆరుసీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ లో అయితే ఖాతా కూడా తెరవలేదు. ఈ నేపథ్యంలో ఆప్ కు ఓ గుడ్ న్యూస్ వచ్చింది.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఒక చోట ఆరుశాతం ఓట్లు, రెండు సీట్లు సాధిస్తే జాతీయ పార్టీగా అవతరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవాళ ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆరుసీట్లు సాధించి ఆరుశాతం ఓట్లు కూడా సాధించినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ఢిల్లీ, గుజరాత్, గోవాతో పాటు గుజరాత్ లో కనీసం ఆరుశాతం ఓట్లు సాధించి జాతీయ పార్టీ అయ్యేందుకు అర్హత సాధించినట్లయింది. దీంతో గుజరాత్ ఎన్నికల్లో పేలవ ప్రదర్శనను మరిపిస్తూ జాతీయ పార్టీ అయ్యే అవకాశం ఆప్ తలుపు తట్టినట్లయింది.
గుజరాత్ ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీని జాతీయ పార్టీగా మారుస్తాయని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియా ఇవాళ ప్రకటించారు. తొలిసారి విద్య, ఆరోగ్యంపై ఆధారపడిన రాజకీయాలకు దేశంలో గుర్తింపు లభిస్తోందన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.