పీఎన్బీలో మరో స్కాం.. ఈసారి రూ.9.1 కోట్లు! ఇదీ నీరవ్ మోడీ తరహాలోనే...
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఆర్థిక మోసాలు ఇప్పట్లో ఆగేలా లేవు. నీరవ్ మోడీ రూ.12 వేల కోట్ల కుంభకోణం మరువకముందే అదే ముంబై పీఎన్బీ బ్రాంచిలో మరో స్కాం వెలుగులోకి వచ్చింది. ఈసారి స్కాం విలువ రూ.9.1 కోట్లు.
ఈ కుంభకోణం కూడా నీరవ్ మోడీ స్కాం తరహాలోనే అధికారుల సహకారంతో జరిగింది. ఈ విషయాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్నతాధికారులు గుర్తించారు. బ్యాంకు అధికారుల సహకారంతో చంద్రీ పేపర్ అండ్ అలైడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమెటెడ్ కంపెనీ ఈ కుంభకోణానికి పాల్పడినట్టు వెల్లడైంది.
కాగ, గత నెలలో వెలుగులోకి వచ్చిన నీరవ్ మోడీ కుంభకోణంలో పీఎన్బీ ముంబై బ్రాంచ్లో దాదాపు రూ.12,700 కోట్ల అవకతవకలు జరిగినట్టు వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ స్కాం వెలుగులోకి రాకముందే, ఈ భారీ మోసానికి పాల్పడిన డైమాండ్ కింగ్ నీరవ్ మోడీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సి, కుటుంబ సభ్యులు దేశం విడిచి పారిపోయారు.
వీరిని ప్రస్తుతం భారత్కు రప్పించడానికి దర్యాప్తు సంస్థలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. మోడీ, చోక్సిలకు వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసు జారీచేయాలని ఇంటర్పోల్ను కూడా కోరుతోంది ఈడీ. మరోవైపు తాజాగా వెలుగులోకి వచ్చిన రూ.9.1 కోట్ల స్కాంపై ఇటు పీఎన్బీ అధికార ప్రతినిధి కానీ, అటు చంద్రీ పేపర్ కానీ వెంటనే స్పందించడం లేదు.