రేపే కేంద్ర బడ్జెట్: ఆదాయపన్ను పరిమితి పెరిగేనా?
అనేక సవాళ్ల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆయన ప్రవేశపెట్టనున్న నాలుగో బడ్జెట్.
న్యూఢిల్లీ: నోట్ల రద్దు అనంతరం ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపన కలిగించేందుకు ప్రత్యక్ష పన్నుల విధానంలో భారీ మార్పులు చేసే అవకాశముందనే వాదనలు వినిపిస్తున్నాయి. 60 ఏళ్ల లోపు వారికి వార్షిక ఆదాయ పరిమితి ప్రస్తుతం రూ.2.5 లక్షలు ఉండగా, దానిని రూ.3 లక్షలకు పెంచే అవకాశముంది. దీనిని రూ.5 లక్షలకు పెంచే అవకాశాలు కూడా కొట్టి పారేయలేమని అంటున్నారు.
అలా సాధ్యం కాకుంటే ఆదాయ పన్ను లెక్కింపులో గృహ రుణాల వడ్డీని మినహాయించే పరిమితిని పెంచే అవకాశముందని అంటున్నారు. ప్రస్తుతం రూ.2 లక్షల వడ్డీకి మినహాయింపు ఉండగా, దానిని రూ.2.5 లక్షలకు పెంచే వీలుంది. దీని వల్ల లక్షలాది మందికి మేలు.
పన్ను రేట్లలో మార్పులు
పన్ను రేట్లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చునని, ఆదాయ పన్ను పరిమితిని రూ.3 లక్షలకు పెంచితే రూ.5 లక్షల ఆదాయం ఉన్న వారంతా 10 శాతం పన్ను పరిధిలోకి వస్తారని, అందువల్ల పన్ను రేట్లలో మార్పులు చేయకపోవచ్చని అంటున్నారు.
జీఎస్టీ శ్రేణులకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న పదిహేను శాతం సేవా పన్నును ఒక శాతం మేర పెంచే అవకాశముందని అంటున్నారు. అయితే జూలై 1 నుంచి జీఎస్టీ అమలు చేయాలని ప్రభుత్వం విడిగా కసరత్తు చేస్తున్నందున బడ్జెట్లో దీనిపై ప్రత్యేకంగా ప్రకటనలు చేయకపోవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేవిధంగా పలు ప్రకటనలు చేయవచ్చునని అంటున్నారు.