లైంగిక దాడి కేసు: ఆశారాం తనయుడి అరెస్టు
న్యూఢిల్లీ: లైంగిక దాడి కేసులో నిందితుడైన ఆశారాం సాయి తనయుడు నారాయణ సాయిని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. గత 58 రోజులుగా అతను పరారీలో ఉన్నాడు. సూరత్లో లైంగిక దాడి కేసులో నారాయణ సాయి నిందితుడు. అరెస్టు చేసిన సమయంలో అతను టర్బన్ ధరించి ఉన్నాడు.
నారాయణ సాయిని గుజరాత్ పోలీసులకు అప్పగించనున్నట్లు ఢిల్లీ ఎసిపి (క్రైమ్) రవీంద్ర యాదవ్ చెప్పారు. నారాయణ సాయి తొలుత కురుక్షేత్రలోని పిప్లీ గ్రామంలో దర్సనమిచ్చాడు. అతన్ని అక్కడి నుంచి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అనుసరించి, ఢిల్లీ సరిహద్దుల్లో అరెస్టు చేశారు. బుధవారం తెల్లవారు జామున అతన్ని అరెస్టు చేశారు.
ఆచూకీ తెలియడంతో అతన్ని పట్టుకోవడానికి 30 మంది సభ్యులతో కూడిన క్రైం బ్రాంచ్ పోలీసులు లూథియానా చేరుకున్నారు. వారు అక్కడికి చేరుకున్న తర్వాత సాయి యుపి రిజిస్ట్రేషన్ నెంబర్ గల ఫోర్డ్ ఎకో స్పోర్ట్లో ఢిల్లీ వైపు వెళ్లినట్లు సమాచారం అందింది.
వివిధ మార్గాల ద్వారా అతను తప్పించుకోవడానికి చూశాడు. అయితే, ఇంధనం నింపుకునే స్టేషన్లో ఓ బృందం అతన్ని పట్టుకోగలిగింది. వాహనంలో నారాయణ సాయితో పాటు రమేష్ (27), వంట చేసే మైనర్ బాలుడు, కౌశల్ అలియాస్ హనుమాన్ అనే శిష్యుడు ఉన్నారు. రమేష్ వాహనం డ్రైవర్. నారాయణ సాయి పేరుతో పాటు కౌశల్ పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు.
నారాయణ సాయిని పట్టిచ్చినవారికి ఐదు లక్షల రివార్డు ఇస్తామని కూడా ప్రకటించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సమయంలో నారాయణ సాయి జైపూర్లో ఉన్నాడు. అక్కడి నుంచి ఆగ్రా వెళ్లాడు. మర్నాడు ఢిల్లీ వచ్చాడు. ఆ సమయంలో అతను సీతాపూర్లోని నైమిషారణంలో ఉన్నాడు. అతను తన వేషాన్ని అక్కడే మార్చుకున్నాడు. ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో దాచుకుంటూ పోలీసులకు దొరక్కకుండా తప్పించుకుని తిరిగాడు.