Asia Cup 2023 : పాకిస్తాన్ కు భారత్ వెళ్లక తప్పడం లేదా ? అక్కడ మ్యాచ్ లు ఆడకున్నా !
ఆసియా కప్ 2023 ఇవాళ్టితో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో ప్రపంచ నంబర్ వన్ జట్టు పాకిస్తాన్ తో నేపాల్ తలపడబోతోంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు టోర్నీ ప్రారంభోత్సవం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి పాకిస్తాన్ వేదిక కానుంది. పాకిస్తాన్ లోని ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కు ముందు జరిగే ఆసియా కప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అన్ని జట్లు పాల్గొంటున్నాయి. దీంతో పాటు భారత బృందం కూడా పాల్గొనబోతోంది.
ఆసియాకప్ లో భాగంగా పాకిస్తాన్ లో జరిగే మ్యాచ్ లకు హాజరయ్యేందుకు భారత్ నిరాకరించింది. భద్రతా కారణాలను చూపుతూ పాకిస్తాన్ లో తమ జట్టు మ్యాచ్ లు ఆడించేందుకు బీసీసీఐ ససేమిరా అంది. అయితే చివర్లో టోర్నీలోని ఇతర ఆసియా దేశాల బోర్డుల జోక్యంతో భారత్ తమ మ్యాచ్ లు తటస్ధ వేదికగా భావిస్తూ శ్రీలంకలో ఆడేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో భారత్ తాము ఈ టోర్నీలో ఆడే మ్యాచ్ లను కేవలం శ్రీలంకలోనే ఆడబోతోంది. మిగతా జట్లు, మిగతా మ్యాచ్ లు మాత్రం పాకిస్తాన్ లోనే ఆడతాయి.

ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే ఆసియాకప్ టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాత్రం భారత్ హాజరు కాబోతోంది. బీసీసీఐ తరఫున అధ్యక్షుడు రోజర్ బిన్నీతో పాటు కార్యదర్శి జైషా, ఇతర అధికారులు భారత్ తరఫున ఈ కార్యక్రమంలో హాజరుకాబోతున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఆగస్టు 30న జరిగే ఆసియా కప్ ప్రారంభోత్సవానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా పాక్లో పర్యటించనున్నట్లు పీసీబీ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ జకా అష్రఫ్ తాజాగా వెల్లడించారు.
దీంతో భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ లో మ్యాచ్ లు ఆడకుండా అడ్డుకున్న బీసీసీఐ పెద్దలు.. తాము మాత్రం ప్రారంభోత్సవ వేడుకలకు హాజరుకాబోతుండటం విశేషం. ఈ ఏడాది ఆసియా కప్ కు ఆతిధ్యమిస్తున్న పాకిస్తాన్... బీసీసీఐ అభ్యంతరాల నేపథ్యంలో శ్రీలంకను కూడా సహ ఆతిధ్య దేశంగా ఎంచుకుంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్ ప్రారంభ వేడుకలు మాత్రం పాకిస్తాన్ లోనే నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీలో పాకిస్తాన్ లో ఆడకూడదని నిర్ణయించుకున్న టీమిండియా తమ తొలి మ్యాచ్ ను మాత్రం శ్రీలంకలోని పల్లెకెలే ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ నెల సెప్టెంబర్ 2న ఆడనుంది.












Click it and Unblock the Notifications