జమ్మూకాశ్మీర్లో కొనసాగుతున్న ఎన్కౌంటర్: జైష్-ఏ-మహమ్మద్ టాప్ టెర్రరిస్ట్ కైజర్ కోకాతో పాటు మరొకరు హతం
జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి భద్రతా దళాలు పోలీసులు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో ఉగ్రమూక జమ్మూకాశ్మీర్లో అల్లర్లు సృష్టించడానికి, దేశంలోకి చొరబాట్లకు అంతే తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అటు ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జమ్మూకాశ్మీర్లో ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది.
అవంతిపోరాలో కొనసాగుతున్న ఎన్కౌంటర్
తాజాగా దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని అవంతిపోరాలోని వండక్పోరా ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లు సోమవారం భద్రతా బలగాలతో పాటు పోలీసులు ప్రకటించారు. అవంతిపోరా ఎన్కౌంటర్ లో ఇప్పటివరకు ఇద్దరూ ఉగ్రవాదులు హతమయ్యారు . ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని భద్రతా బలగాలతో పాటు పోలీసులు తెలిపారు. ఎన్ కౌంటర్ పై పోలీసులు చేసిన ప్రత్యేక ప్రకటనలో, కాశ్మీర్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్ మాట్లాడుతూ, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన పేరుమోసిన ఉగ్రవాది కైజర్ కోకా ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు ధ్రువీకరించారు. 2018 నుండి ఆటను ఉగ్రవాద కార్యాకలాపాలలో యాక్టివ్ గా ఉన్నట్టు పేర్కొన్నారు.
జైషే మహమ్మద్ టాప్ఉగ్రవాది కైజర్ కోకాతో పాటు మరొకరు హతం
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో, దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని అవంతిపోరాలోని వండక్పోరా ప్రాంతంలో ఈ మధ్యాహ్నం జరిగిన ఎన్కౌంటర్లో హతమైన టెర్రరిస్టుల్లో ఒకరిని జైషే మహమ్మద్ టాప్ఉగ్రవాది కైజర్ కోకాగా గుర్తించగా, రెండో ఉగ్రవాది ఆచూకీ కోసం గాలిస్తున్నారు. త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. పక్కా సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడంతో ఎన్కౌంటర్ ప్రారంభమైనట్లు సమాచారం. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఒక USA-మేడ్ రైఫిల్ M-4 కార్బైన్, ఒక పిస్టల్ మరియు ఇతర మెటీరియల్లతో సహా ఆయుధాలు, పేలుడు సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు.
గత వారం ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు లొంగుబాటు
ఇదిలా ఉంటే గత బుధవారం, జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు చేసిన సర్చ్ ఆపరేషన్లో ఇటీవల రిక్రూట్ అయిన ఇద్దరు స్థానిక లష్కరే తోయిబా ఉగ్రవాదులు భద్రతా దళాల ముందు లొంగిపోయారు. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని హడిగామ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులు మరియు భద్రతా బలగాలు ఉదయం వరకు పదే పదే లొంగిపోవడానికి విజ్ఞప్తులు చేయడంతో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు చివరకు ఆయుధాలతో లొంగిపోయారు. తర్వాత వారిని జమ్మూ కాశ్మీర్ పోలీసులకు అప్పగించారు.