కర్నాటకలో కీలక పరిణామం-మంత్రి రాజీనామా- ఆరోపణలపై కన్నీళ్లు..!
కర్నాటక కేబినెట్ మంత్రి బి. నాగేంద్ర (B Nagendra) ఇవాళ తన పదవికి గుడ్ బై చెప్పేశారు. కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి సంస్థలో రూ.89 కోట్ల మేర అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెంటాడుతున్న నేపథ్యంలో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. గతంలోనూ ఇవే ఆరోపణలపై ఓసారి మంత్రి పదవికి రాజీనామా చేసిన నాగేంద్ర.. ఇప్పుడు మరోసారి అదే కారణంతో తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో తనపై వచ్చిన ఆరోపణలపై నాగేంద్ర కంటతడి పెట్టుకున్నారు.
మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి సంస్థలో జరిగిన అక్రమాలు, అందులో మంత్రి నాగేంద్ర పాత్రపై బీజేపీ వరుసగా ఆరోపణలు గుప్పిస్తోంది. దీంతో ఈ వ్యవహారం డీకే శివకుమార్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ మధ్య కర్నాటకలో సిద్ద రామయ్య స్ధానంలో సీఎంగా పగ్గాలు చేపట్టిన డీకే శివకుమార్ మంత్రిగా నాగేంద్రను కేబినెట్లోకి తీసుకున్నారు. అయితే మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి సంస్థలో నిధుల అనధికార బదిలీ గురించి ప్రస్తావిస్తూ రాసిన లేఖను వదిలిపెట్టి రెండేళ్ల క్రితం ఆ సంస్థ అకౌంట్స్ ఆఫీసర్ చంద్రశేఖరన్ ఆత్మహత్య చేసుకోవడం, ఆ తర్వాత జరిగిన విచారణలో సంస్థ బ్యాంక్ ఖాతాల నుండి భారీ మొత్తంలో నిధులు ఇతర ఖాతాలకు బదిలీ అయినట్లు తేలడం సంచలనం రేపింది.

అప్పట్లో మంత్రిగా ఉన్న నాగేంద్ర ఈ అరోపణలపై తన మంత్రి పదవి వదులుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మరోసారి బీజేపీ అవే ఆరోపణలతో ఒత్తిడి పెంచడంతో డీకే శివకుమార్ సూచన మేరకు నాగేంద్ర మరోసారి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా బీజేపీ తీరుపై నాగేంద్ర తీవ్రంగా మండిపడ్డారు. రాజీనామా తన వ్యక్తిగత నిర్ణయమేనని, అధిష్టానం ఆదేశాలు ఇవ్వలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. తనకు రాజ్యాంగంపై నమ్మకం ఉందని, తనపై వచ్చిన ఆరోపణలపై అసెంబ్లీలో చర్చించాలని బీజేపీని చాలాసార్లు కోరినా ముందుకు రాలేదని గుర్తుచేశారు. తనపై ఆరోపణలకు అసలు ఆధారం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. బీజేపీ మనుస్మృతిని రుద్దాలని కోరుకుంటోందని ఆరోపించారు. ఆ పార్టీకి గిరిజన వ్యతిరేక మనస్తత్వం ఉందన్నారు. దళితుడిని కాబట్టే తనపై దాడులు జరుగుతున్నాయని అన్నారు.














Click it and Unblock the Notifications