బెంగళూరులో నకిలీ ఐటీ కంపెనీ: 50 మంది టెక్కీలు, రూ. 70 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ !
బెంగళూరు నగరంలో మరో బోగస్ ఐటీ కంపెనీ50 మంది నిరుద్యోగ ఇంజనీర్లను మోసం చేసి బోర్డు తిప్పేశారుసెక్యూరిటీ డిపాజిట్ కింద ఒక్కొక్కరి దగ్గర రూ. 1.40 లక్షలు పైసా వసూల్
బెంగళూరు: సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసుకుని కంపెనీ బోర్డు తిప్పేసిన ఘటన బెంగళూరు నగరంలో మరోసారి వెలుగు చూసింది. కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు నకిలి సాఫ్ట్ వేర్ కంపెనీ నిర్వహకుల కోసం గాలిస్తున్నారు.
బెంగళూరు నగరంలోని ఐటీపీఎల్ సమీపంలోని వైట్ ఫీల్డ్ లో నవీన్ వేగ, రాయశ్రీ పరీచ్ అనే ఇద్దరు ఈపీఐపీ ఫేస్-1లో రియాన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సాఫ్ట్ వేర్ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ గా బాలక్రిష్ణ, మేనేజర్ గా మహేంద్ర అనే ఇద్దరు ఉన్నారు.
బెంగళూరు నిరుద్యోగి
బెంగళూరులోని దోడ్డ బాణసవాడికి చెందిన కిరణ్ (25) అనే యువకుడు 2016లో ఎంటెక్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేశాడు. తరువాత రియాన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగాలు ఉన్నాయని తెలుసుకుని అక్కడికి వెళ్లాడు.
రూ. 1.40 లక్షలు, ఉద్యోగం ఇస్తాం
నిరుద్యోగి కిరణ్ కంపెనీ డైరెక్టర్ నవీన్ వేగ, రాయశ్రీ పరీచ్ ను కలిశాడు. కంపెనీలో నీకు టెక్కీగా ఉద్యోగం ఇస్తామని, శిక్షణలో భాగంగా ఐదు నెలలు రూ. 10 వేలు స్టైఫండ్ ఇస్తామని, తరువాత ప్రతి నెల రూ. 20 వేలు జీతం ఇస్తామని నమ్మించారు. ఉద్యోగంలో చేరాలంటే మొదట రూ. 1.40 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చెయ్యాలని, ఆ డబ్బు తిరిగి చెల్లిస్తామని చెప్పారు.
ఉద్యోగం వస్తుంది
ఉద్యోగం వస్తుందనే ఆశతో కిరణ్ రూ. 1.40 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాడు. ఐదు నెలలు శిక్షణ ఇచ్చినా తనకు జీతం ఇవ్వకపోవడంతో కిరణ్ కు అనుమానం వచ్చింది. దాదాపు 50 మందికి శిక్షణ ఇచ్చినా నిర్వహకులు ఒక్కరికి కూడా జీతాలు ఇవ్వకుండా ఈ రోజు రేపు అంటూ కాలం గడుపుతూ వచ్చారు.
తాళం వేసి మాయం
ఇటీవల కిరణ్ తో పాటు 50 మంది రియాన్ కంపెనీ దగ్గరకు వెళ్లి చూడగా తాళం వేసి ఉండటంతో ఆందోళన చెందారు. వారం రోజులు అయినా కంపెనీ తాళం తియ్యకపోవడం, కంపెనీ నిర్వహకులు మాయం కావడంతో అది బోగస్ ఐటీ కంపెనీ అని గుర్తించి మోసం జరిగిందని కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదే ప్రాంతంలో నాలుగో సారి
కేసు నమోదు చేసిన పోలీసులు నకిలి ఐటీ కంపెనీ నిర్వహకులు నవీన్ వేగ, రాయశ్రీ పరీచ్, హెచ్ఆర్ బాలక్రిష్ణ, మేనేజ్ మహేంద్ర కోసం గాలిస్తున్నారు. గతంలో ఇదే వైట్ ఫీల్డ్ లోని ఈపీఐపీ ఫేస్-1లో మూడు బోగస్ ఐటీ కంపెనీలో ఇలాగే నిరుద్యోగులను మోసం చేసి బోర్డు తిప్పేసి దర్జాగా తప్పించుకుని పారిపోయారు.