మే 25న భారత్ బంద్; కుల ప్రాతిపదికన జనాభా గణన డిమాండ్తో దేశ వ్యాప్త బంద్!!
మే 25వ తేదీన భారత్ బంద్ కు ఆలిండియా బ్యాక్వర్డ్, అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) కుల ప్రాతిపదికన జనాభా గణనను కేంద్రం నిర్వహించనందుకు ఆలిండియా బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (బీఏఎంసీఈఎఫ్) బుధవారం (మే 25) భారత్ బంద్కు పిలుపునిచ్చిందని సహరాన్పూర్ జిల్లా అధ్యక్షుడు నీరజ్ ధీమాన్ వెల్లడించారు.
కుల ప్రాతిపదికన జనాభా గణన డిమాండ్తో పాటు, ఎన్నికల సమయంలో ఈవీఎంల వినియోగం మరియు ప్రైవేట్ రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్ల అంశంపై కూడా ఫెడరేషన్ నిరసన వ్యక్తం చేస్తోంది. ఎన్నికల సమయంలో ఈవీఎంల వినియోగాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తుంది. ఈవీఎంల వినియోగంలో కుంభకోణాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తోంది. మరోవైపు రైతులకు కనీస మద్దతు ధర హామీ ఇచ్చేలా చట్టం చెయ్యాలని డిమాండ్ చేస్తుంది. మద్దతు ధర కల్పిస్తామని కేంద్రం హామీలు ఇచ్చినా ఆ హామీలు సరిగా అమలు కావటం లేదు. దీంతో మద్దతు ధర హామీకి చట్టాన్ని చెయ్యాలని డిమాండ్ చేస్తుంది.
దేశంలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని , కేంద్రం తీసుకువచ్చిన ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్ పి ఆర్ ఉపసంహరణ చేయటంపైన కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. మధ్యప్రదేశ్, ఒరిస్సా లో పంచాయతీ ఎన్నికలలో ఓబిసి రిజర్వేషన్లను అమలు చేయడం వంటి డిమాండ్లను చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ ముసుగులో గిరిజనులను తరలించడం వంటివి చేయరాదని పేర్కొంది. నిర్బంధంగా టీకాలు వేయించరాదని, దేశంలో టీకాలు వేయడం తప్పనిసరి కాదంటూ వెల్లడించింది.
కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో కార్మికులపై రహస్యంగా రూపొందించిన కార్మిక చట్టాల నుండి రక్షణ కల్పించాలని పేర్కొంది. ఈ ప్రధాన డిమాండ్లతో భారత్ బంద్ నిర్వహించనున్నారు. మే 25న భారత్ బంద్ సందర్భంగా వర్తక వాణిజ్య సముదాయాలను, ప్రజా రవాణాను నిలిపివేయాలని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పలు సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. మరి రేపు నిర్వహించనున్న భారత్ బంద్ ఎలా కొనసాగుతుందో తెలియాల్సి ఉంది.