సుప్రీంకోర్టు బిగ్ యూటర్న్ ..! రాష్ట్రపతి, గవర్నర్లకు ఊరట..!
పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించి పంపే బిల్లుల్ని నిర్ణీత కాలవ్యవధిలో ఆమోదించి పంపాల్సిందేనంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు వెనక్కి తగ్గింది. బిల్లుల్ని మూడు నెలల వ్యవధిలో ఆమోదించి పంపాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ ఇవాళ చారిత్రక ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో బిల్లుల క్లియరెన్స్ ల విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు భారీ ఊరట దక్కినట్లయింది.
గతేడాది తమిళనాడు అసెంబ్లీ ఆమోదించి పంపిన 11 బిల్లుల్ని అక్కడి గవర్నర్ బీఎన్ రవి ఆమోదించకుండా పక్కనబెట్టేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అలాగే పంజాబ్, కేరళ గవర్నర్లు కూడా తమ అసెంబ్లీలు పంపిన బిల్లుల్ని ఆమోదించలేదు. వీటిపై దాఖలైన పిటిషన్లపై స్పందించిన సుప్రీంకోర్టు.. రాష్ట్రపతి, గవర్నర్లు మూడు నెలల్లో బిల్లుల్ని ఆమోదించి పంపాల్సిందేనని, లేకపోతే ఆటోమేటిగ్గా అవి ఆమోదం పొందినట్లేనని కీలక తీర్పు ఇచ్చింది. అప్పటికే తమిళనాడు గవర్నర్ పెండింగ్ లో పెట్టిన 11 బిల్లుల్ని ఆటోమేటిగ్గా అమోదిస్తూ ఆదేశాలు కూడా ఇచ్చింది.

దీనిపై ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సుప్రీంకోర్టు వివరణ కోరారు. రాజ్యాంగంలో ఈ మేరకు ఉన్న నిబంధనల్ని ఓసారి పరిశీలించాలని కోరారు. దీంతో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. చివరకు ఇవాళ రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లుల ఆమోదం విషయంలో గడువులు పెట్టలేమని తేల్చిచెప్పేసింది. బిల్లులను ఆమోదించే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లు సమయపాలనకు కట్టుబడి ఉండలేరని సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం.. రాష్ట్రపతి లేదా గవర్నర్ల చర్యలు న్యాయబద్ధమైనవి కాదని, బిల్లు చట్టంగా మారినప్పుడే న్యాయ సమీక్షను ప్రారంభించవచ్చని తేల్చేసింది.

రాష్ట్రపతి.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద బిల్లును తనకు సమర్పించినప్పుడు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాల్ని వాడుకుంటూ కేబినెట్ అందించే సాయం, సలహాలకు గవర్నర్ కట్టుబడి ఉంటారా అని అడిగారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 361ని ఆమె ఉదహరించారు. ఇది రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలు , విధులను నిర్వర్తించడంలో ఏ కోర్టుకు జవాబుదారీగా ఉండరని చెబుతోంది. దీంతో భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ ఇలా డెడ్ లైన్లు పెట్టడం రాజ్యాంగ విరుద్దమని తేల్చేసింది.
అలాగే బిల్లుల విషయంలో గవర్నర్కు 3 ఎంపికలు మాత్రమే ఉంటాయని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. బిల్లు ఆమోదం, అసెంబ్లీకి తిరిగి పంపడం, రాష్ట్రపతికి పంపటమే గవర్నర్ ముందు ఉన్న 3 ఎంపికని సుప్రీంకోర్టు పేర్కొంది. మూడు అధికారాలు కాకుండా నాలుగో అధికారం గవర్నర్కు లేదని తెలిపింది. ఆర్టికల్ 200 కింద గవర్నర్ ముందు నాలుగో ఎంపిక లేదని వెల్లడించింది. అలాగే బిల్లులను సుదీర్ఘకాలం పెండిoగ్లో పెట్టడం సరికాదని సీజేఐ జస్టిస్ గవాయ్ ధర్మాసనం అభిప్రాయపడింది. పున:పరిశీలనకు పంపకుండా నిలిపివేయడం సమాఖ్యవాదాన్ని ఉల్లంఘించడమేనని తెలిపింది.












Click it and Unblock the Notifications