భారత్ కు బిగ్ రిలీఫ్ .. 15 వేలకు దిగువన కరోనా కొత్త కేసులు, 181మరణాలు
భారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు నమోదవుతున్నాయి. గత కొద్ది రోజులుగా కరోనా క్షీణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 24 గంటల్లో భారతదేశంలో 14,313 కొత్త కేసులు నమోదయ్యాయి. 215 రోజులలో ఇంత తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. గత 24 గంటల్లో 181 మరణాలు సంభవించాయి. గత 24 గంటల్లో 11 లక్షలకు పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తంగా 58,50,38,043 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
ప్రస్తుతం దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు 3,39,85,920 కాగా, ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,14,900 గా ఉన్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం మొత్తం రికవరీలు 3,33,20,057 గా నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సంభవించిన మొత్తం మరణాల సంఖ్య 4,50,963గా ఉంది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం యుద్ధప్రాతిపదికన సాగుతోంది. దేశ వ్యాప్తంగా పంపిణీ అయిన మొత్తం వ్యాక్సిన్ డోసుల సంఖ్య 95,89,78,049 గా ఉంది. గత 24 గంటల్లో 65,86,092 వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లుగా సమాచారం.
జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98 శాతంగా నమోదైంది. మార్చి 2020 నుండి ఇది ప్రస్తుతం అత్యధికంగా నమోదైనట్టు కనిపిస్తుంది. గత 24 గంటల్లో 21,563 రికవరీలతో, దేశంలో మొత్తం రికవరీలు 3,32,93,478 కి పెరిగాయి. భారతదేశ కోవిడ్ -19 టీకా వ్యాక్సిన్ ల పంపిణీ ఇప్పటి వరకు 94.70 కోట్లు దాటింది. గత 24 గంటల్లో భారతదేశంలో రోజువారీ కేసుల్లో అత్యంత ప్రభావితం అవుతున్న కేరళ రాష్ట్రంలో 6,996 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, 84 మంది మరణించారు. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో 101483 తర్వాత యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న మహారాష్ట్రలో గత 24 గంటల్లో 1736 కొత్త కేసులు నమోదు కాగా, 36 మంది కరోనా కారణంగా మృతి చెందారు. మహారాష్ట్రలో ప్రస్తుతం 32,115 యాక్టివ్ కేసులున్నాయి. మహారాష్ట్ర తర్వాత కరోనా కేసులు ఎక్కువగా నమోదు చేస్తున్న తమిళనాడు రాష్ట్రంలో గత 24 గంటల్లో 1303 కరోనా కేసులు నమోదు కాగా, 13 మంది మరణించారు. 15,992 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలో గత 24 గంటల్లో 307 కరోనా కేసులు నమోదు కాగా నలుగురు మరణించారు. మిజోరాంలో గత 24 గంటల్లో కరోనా కేసుల క్షీణత ప్రధానంగా కనిపిస్తుంది.
Recommended Video
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 620 కేసులు నమోదు కాగా తొమ్మిది మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ గత 24 గంటల్లో 310 కరోనా కేసులు నమోదు కాగా ఇద్దరు మరణించారు. కర్ణాటక రాష్ట్రం లోనూ గత 24 గంటల్లో 373 కరోనా కేసులు నమోదు కాగా పది మరణాలు సంభవించాయి. ఒడిశా రాష్ట్రంలో 448 కరోనా కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందారు. దేశ రాజధాని ఢిల్లీలో గత 24 గంటల్లో 23 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా జీరో మరణాలు సంభవించాయి.