బిజెపి అడుక్కుంటోంది: కేజ్రీ, స్కాంలో కాంగ్రెస్ నేతలు
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ తన క్షమాపణ కోసం అడుక్కుంటోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. డిడిసిఎ వ్యవహారంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పైన కేజ్రీవాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దీనిపై కేజ్రీవాల్ ప్రభుత్వమే ముగ్గురితో కూడిన కమిటీని విచారణ కోసం వేసింది. ఢిల్లీ ప్రభుత్వం వేసిన కమిటీ విచారణ.. నివేదికలోనే ఎక్కడా అరుణ్ జైట్లీ పేరు లేదు. ఈ నేపథ్యంలో జైట్లీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని బిజెపి డిమాండ్ చేస్తోంది.
దీనిపై కేజ్రీవాల్ స్పందించారు. దర్యాప్తు కమిటీ జైట్లీకి క్లీన్చిట్ ఇచ్చినట్టుగా బీజేపీ చెప్పుకోవడాన్ని కేజ్రీవాల్ ఖండించారు. పైగా జైట్లీపై ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ దేహి అని అర్థిస్తోందని, అది జరిగే పని కాదన్నారు.
13 సంవత్సరాలపాటు డీడీసీఏ అధ్యక్షుడుగా ఉన్న జైట్లీకి దర్యాప్తు కమిటీ క్లీన్చిట్ ఇవ్వనేలేదన్నారు. కాగా దర్యాప్తు కమిషన్ చైర్మన్గా నియమితులైన మాజీ సాలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రమణ్యం మొత్తం విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రకటించారు.
డీడీసీఏలో ఎలాంటి కుంభకోణం జరుగలేదని ఆర్థికనేరాల దర్యాప్తు సంస్థ ఎస్ఎఫ్ఐఓ నిర్ధారించినట్టు బీజేపీ ప్రచారం చేయడాన్ని సస్పెండైన ఆ పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్ ఖండించారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ, ఈడీతో సహా కేంద్ర విభాగాలతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
తాను జైట్లీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ నేతలకు కూడా ఈ కుంభకోణంలో సంబంధం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇది వరకటి యూపీఏ సర్కారు ఈ కుంభకోణంపై చర్య తీసుకోకపోవడానికి ఈ కుంభకోణంలో వారు నియమించిన డైరెక్టర్ల పాత్రే కారణమన్నారు. రాజీవ్ శుక్లా, నవీన్ జిందాల్, అరవింద్సింగ్ లవ్లీ పేర్లను ఈ సందర్భంగా కీర్తి ఆజాద్ ప్రస్తావించారు. తన పోరాటం క్రీడాసంస్థల్లో అవినీతి మీదనేనని, జైట్లీకి వ్యతిరేకంగా కాదన్నారు.