లుథియానా కోర్టులో భారీ పేలుడు: ఇద్దరు మృతి, మరో నలుగురికి తీవ్రగాయాలు, భవనం ధ్వంసం
చండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలోని లుథియానా కోర్టులో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ గటనలో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కోర్టులో చోటు చేసుకున్న ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది.
కోర్టు భవనంలోని రెండో అంతస్తులోని బాత్రూమ్లో మధ్యాహ్నం 12:22 గంటల ప్రాంతంలో పేలుడు జరిగినట్లు సమాచారం. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో బాత్రూమ్ గోడలు దెబ్బతిన్నాయి. సమీపంలోని గదుల కిటికీల అద్దాలు పగిలిపోయాయి.
పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాయి. పేలుడు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, గురువారం న్యాయవాదులు సమ్మెలో ఉండటంతో.. పేలుడు జరిగిన సమయంలో కోర్టు కాంప్లెక్స్ లో కొద్ది మంతి మాత్రమే ఉన్నారు. లేదంటే భారీ ప్రాణ నష్టం జరిగివుండేది.
Disturbing news of a blast at Ludhiana court complex. Saddened to know about the demise of 2 individuals, Praying for the recovery of those injured. @PunjabPoliceInd must get to the bottom of this.
— Capt.Amarinder Singh (@capt_amarinder) December 23, 2021
ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ, మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం చన్నీ ప్రకటించారు. పేలుళ్లకు పాల్పడిన అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కాగా, ఇటీవల ఢిల్లీలోని రోహిణి కోర్టులోనూ స్వల్ప పేలుడు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఓ న్యాయవాది లక్ష్యంగా చేసుకుని డీఆర్డీవో శాస్త్రవేత్త ఒకరు టిఫిన్ బాక్స్ బాంబ్ ను అమర్చినట్లు పోలీసులు తమ విచారణలో తేల్చారు. ఈ ఘటనలో సదరు శాస్త్రవేత్తను పోలీసులు అరెస్ట్ చేశారు.