చెన్నైలో కూలిన భవనం:9మంది మృతి, జయ దిగ్భ్రాంతి
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని మొగలివాక్కంలో శనివారం సాయంత్రం నిర్మాణంలో ఉన్న పదకొండు అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. శిథిలాల కింద ఉన్న దాదాపు ముప్పైకి పైగా మందిని రక్షించారు. గాయపడ్డ వారికి సమీప ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
మరో ముప్పై మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా భావిస్తున్నారు. ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలు చురుగ్గా కొనసాగుతున్నాయి. చెన్నైలోని పదకొండు అంతస్తుల భవనం కూలిన సమయంలో ఆ భవనంలో దాదాపు ఎనబై మంది కార్మికులు పనులు చేస్తున్నారు.

వారిలో ఎంతమంది మరణించారో పూర్తిగా తెలియరాలేదు. కార్మికుల్లో విజయనగరం, విశాఖపట్నం, ఒరిస్సా ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని తెలుస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, తమిళనాడు అగ్నిమాపక దళాలు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. చెన్నై కార్పోరేషన్, చెన్నై మెట్రో రైలు, రహదారుల విభాగానికి చెందిన సాంకేతిక నిపుణులు, భారీ యంత్రాలతో శిథిలాలను తొలగిస్తున్నారు.
జయలలిత దిగ్భ్రాంతి
ప్రమాదం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, గవర్నర్ కొణిజేటి రోశయ్యలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతంగా చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదంపై విచారణ జరిపి నిందితుల పైన చర్యలు తీసుకుంటామని జయలలిత ప్రకటించారు.












Click it and Unblock the Notifications