కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తాజా షాక్.. !
మోడీ 3.0 సర్కార్ లో దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలను గాడిన పెట్టేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు అందరూ ఉదయం 9.15 కల్లా విధుల్లోకి రావాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ (డీఓపీటీ) ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 9.15 కల్లా ఆఫీసులకు రాని ఉద్యోగులు, అధికారుల సాధారణ సెలవుల్లో అర రోజు (హాఫ్ డే) కోత పెడతామని హెచ్చరించింది.
ఉద్యోగులు ఇకపై బయోమెట్రిక్ హాజరును తప్పనిసరిగా వాడాలని, పుస్తకాల్లో సంతకాలు చేస్తే చెల్లవని కూడా కేంద్రం తెలిపింది. ఏదైనా కారణంతో ఓ ఉద్యోగి ఆఫీసుకు రాలేకపోతే ముందు రోజు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని, క్యాజువల్ లీవ్ కు దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది. కోవిడ్ తర్వాత చాలా మంది ఉద్యోగులు ఈ నిబంధనలు పాటించడం లేదు. దీంతో కేంద్రం తాజా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి 2014లో మోడీ సర్కార్ అధికారంలోకి రాగానే బయోమెట్రిక్ హాజరును అమల్లోకి తెచ్చింది. అయితే కోవిడ్ సమయంలో మినహాయింపు ఇవ్వడంతో ఇప్పటికీ చాలా మంది ఉద్యోగులు దుర్వినియోగం చేస్తున్నారు.

ప్రతీ శాఖలోనూ శాఖాధిపతులు (HOD), ఇతర ఉన్నతాధికారులు ఉద్యోగుల హాజరును తప్పనిసరిగా పరిశీలించాలని సిబ్బంది వ్యవహారాలశాఖ ఆదేశాలు ఇచ్చింది. ప్రజలతో సంబంధం ఉన్న శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆలస్యంగా కార్యాలయాలకు రావడం, త్వరగా వెళ్లిపోవడం వల్ల జనానికి అందుబాటులో ఉండటం లేదని కేంద్రం అసంతృప్తిగా ఉంది. అయితే అధికారులు మాత్రం తాము పనివేళల కంటే ఎక్కువగా పనిచేస్తున్నామని, వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్నప్పటికీ సెలవుదినాల్లోనూ పనిచేయాల్సి వస్తోందని వాపోతున్నారు.












Click it and Unblock the Notifications