Chandrayaan 3: ఇస్రో శాస్త్రవేత్తలతో ప్రధాని మోడీ భేటీ-భారత్ రాగానే..అభినందనల వెల్లువ..
చంద్రుడి నిగూఢ రహస్యాలను తెలుసుకునేందుకు ఇస్రో చేపట్టిన మూడో యాత్ర చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది. ఇవాళ జాబిలిపై చంద్రయాన్ విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా ల్యాండ్ కావడంతో సగం పని పూర్తయింది. దీంతో దాదాపు 600 కోట్ల వ్యయంతో ఇస్రో చేపట్టిన ప్రయోగంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కూడా ల్యాండర్ చంద్రుడిపై దిగగానే ఇస్రో శాస్త్రవేత్తల్ని అభినందించారు.
చంద్రయాన్ ల్యాండర్ చంద్రుడిపై దిగగానే ఈ విషయాన్ని ప్రకటించిన ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ బ్రిక్స్ సదస్సు కోసం వెళ్లి వర్చువల్ గా ఈ ప్రయోగాన్ని తిలకించిన ప్రధాని మోడీకి లైవ్ లో తెలిపారు. దీంతో ప్రధాని మోడీ ఇస్రో శాస్త్రవేత్తల్ని అభినందిస్తూ.. తన సందేశం వినిపించారు. "చంద్రయాన్-3 యొక్క విజయం 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు మరియు సామర్థ్యాలకు అద్దం పడుతోందని, కొత్త క్షితిజాలకు మరియు అంతకు మించి! భారతదేశానికి గర్వకారణం" అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఎక్స్ లో కూడా పోస్ట్ చేసారు.

ఈ నేపథ్యంలో బ్రిక్స్ సదస్సు నుంచి భారత్ కు తిరిగి రాగానే ఇస్రో శాస్త్రవేత్తలతో ప్రధాని మోడీ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. శనివారం బ్రిక్స్ భేటీ ముగించుకుని ప్రధాని మోడీ భారత్ తిరికి వచ్చే అవకాశముంది. రాగానే ఆయన ఇస్రో శాస్త్రవేత్తలతో స్వయంగా భేటీ అయి వారిని అభినందించనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాబోయే ప్రయోగాలకు సంబంధించి కూడా ఇస్రోకు అందించాల్సిన సహకారంతో వారితో చర్చిస్తారని సమాచారం.

మరోవైపు చంద్రయాన్ సక్సెస్ పై దేశ విదేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విజయం సమష్టిగా భారతీయులందరిదీ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. ఇది ప్రధాని పాలనా దక్షతకు నిదర్శమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. అటు యూకే స్పేస్ ఏజెన్సీ కూడా చంద్రయాన్ విజయంపై ఇస్రోకు అభినందనలు తెలిపింది. చరిత్ర సృష్టించారంటూ అందులో పేర్కొంది.












Click it and Unblock the Notifications