భారత్ పై చైనా కుయుక్తులు ... బంగ్లాదేశ్ తో బంధం అందుకేనా !! పావులు కదుపుతున్న చైనా
సరిహద్దు వివాదంతో భారతదేశంతో చైనాకు యుద్ధ వాతావరణం నెలకొంది. ఇక ఈ క్రమంలో భారతదేశానికి సన్నిహితంగా ఉన్న దేశాలను తనవైపుకు తిప్పుకునే కుట్రలపై చైనా దృష్టి పెట్టింది. అందులో భాగంగా నేపాల్, శ్రీలంక, భూటాన్ వంటి దేశాలను పెట్టుబడులు పెడుతూ ఆయా దేశాలను మచ్చిక చేసుకొంటోంది చైనా.

బంగ్లాదేశ్ ఎగుమతిచేసే 5161 రకాల వస్తువులపై టారిఫ్ 97% రద్దు చేసిన చైనా
ఇక భారతదేశం అంటే మొదటి నుండి పాకిస్తాన్ శత్రుదేశంగానే చూస్తున్న విషయం తెలిసిందే. ఇక పాకిస్తాన్ కి కూడా చైనా గట్టిగానే మద్దతు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక ఇదే క్రమంలో ప్రస్తుతం చైనా కన్ను బంగ్లాదేశ్ మీద పడిందని తాజా పరిణామాలతో అర్థమవుతోంది. భారతదేశానికి సన్నిహితంగా ఉండే బంగ్లాదేశ్ కు మరింత చేరువ అవ్వాలన్న ఉద్దేశంతో చైనా బంగ్లాదేశ్ ఎగుమతిచేసే 5161 రకాల వస్తువులపై టారిఫ్ ను 97% రద్దు చేసింది.

భారత సైనికులపై దాడి చేసిన మర్నాడే చైనా నిర్ణయం
లడఖ్ లోని గాల్వాన్ లోయలో భారత సైనికులపై దాడి చేసిన మర్నాడే చైనా బంగ్లాదేశ్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించడం గమనించాల్సిన అంశం. తక్కువ అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకుంటూ ఉండే బంగ్లాదేశ్ ఈ టారిఫ్ లను రద్దు చేయాలని చైనాను కోరగా చైనా తాజా పరిణామాల నేపథ్యంలో జూన్ 16న టారిఫ్ రద్దుకు సానుకూలంగా స్పందించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక బంగ్లాదేశ్ కు అనుకూలంగా చైనా తీసుకున్నఈ నిర్ణయం జూలై 1 నుండి అమలులోకి వస్తుందని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది .

బంగ్లాదేశ్ ను మచ్చిక చేసుకునే కుట్ర
ఇప్పటికే బంగ్లాదేశ్ కొన్ని ఉత్పత్తులపై టారీఫ్ ను పూర్తిగా తొలగిస్తూ, మరికొన్నిటి పై 97% టారిఫ్ రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్న చైనా ప్రభుత్వం, 3095 రకాల వస్తువులపై ఇప్పటికే టారిఫ్ విధించటం లేదు. ఆసియా-పసిఫిక్ ఒప్పందంలో భాగంగా చైనా బంగ్లాదేశ్ కు ఈ లాభాన్ని చేకూరుస్తుంది. ఇక ఈ సమయంలో మరొకమారు చైనా బంగ్లాదేశ్ ఉత్పత్తులపై 97 శాతం టారిఫ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం చైనా కుట్ర అని చాలా మంది భావిస్తున్నారు.
Recommended Video

భారత్ విషయంలో ప్రతికూలంగానే బంగ్లాదేశ్
చైనా బంగ్లాదేశ్ కు మరింత చేరువ కావటం కోసం, వారితో దోస్తానా చేయడం భారతదేశానికి ఇబ్బందిగా మారవచ్చు అన్న సంకేతం కనిపిస్తోంది. ఇక బంగ్లాదేశ్ కూడా భారత దేశం విషయంలో కాస్త ప్రతికూలంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే భారతదేశంలో పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక తయారు చేయాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం, ఇతర దేశాల నుండి వచ్చే వారి జాబితా తయారు చేస్తున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ భారతదేశం విషయంలో కాస్త ప్రతికూలంగా ఉంది. ఇక ఇదే సమయంలో చైనా బంగ్లాదేశ్ కు వల వేయడంతో తాజా పరిస్థితులు భారత్ కు చిరాకుగా మారాయి అని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications