గతంలో ఇలా...: పారికర్ ప్రభుత్వం ఏర్పాటు నైతికమా...
న్యూఢిల్లీ: గోవా నూతన సీఎంగా మనోహర్ పారికర్ ప్రమాణ స్వీకారాన్ని నిలువరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడం ఊహించిన పరిణామమే. కానీ గురువారమే సభలో విశ్వాస పరీక్షలో నెగ్గాలని మనోహర్ పారికర్ను దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడం ఇప్పటివరకు అనుసరిస్తూ వచ్చిన సంప్రదాయాలు, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే తప్ప మరొకటి కాదు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ రాకుంటే గతంలో గవర్నర్లు అనుసరిస్తూ వచ్చిన పలు సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకుని సరైన నిర్ణయం తీసుకోవడమే పరిష్కార మార్గంగా కనిపిస్తున్నది.గవర్నర్ ముందు తమకు గల మెజారిటీ సభ్యుల మద్దతుతో కూడిన అఫిడవిట్లను ఎందుకు సమర్పించలేదని కాంగ్రెస్ పార్టీని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది.
గతంలో 1989లో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజీవ్ గాంధీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ముందుగా నాటి రాష్ట్రపతి వెంకట్రామన్ ఆహ్వానించారు. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు రాజీవ్ గాంధీ గౌరవంగా తిరస్కరించారు. కానీ తర్వాత 1996లోనూ అతిపెద్ద పార్టీగా ఎన్నికైన బీజేపీ నేత ఎబి వాజ్ పేయిని తొలుత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నాటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ఆహ్వానించడమూ సబబే. అయితే 13 రోజుల్లో సభా విశ్వాసం పొందలేక వాజ్ పేయి ప్రభుత్వం రాజీనామా చేసింది అది వేరే సంగతి.
13 రోజులకే వాజ్పేయి సర్కార్ పతనం
1996లో వాజ్పేయి ప్రభుత్వం 13 రోజుల పాటు మాత్రమే మనుగడ సాధించడంతో విధాన నిర్ణేతలు తదుపరి ప్రభుత్వాల ఏర్పాటుకు తాజా విధానాలు, మార్గాలపై ద్రుష్టి సారించారు. మద్దతునిచ్చే ఎమ్మెల్యేల అఫిడవిట్లు సమర్పించాలన్న సంప్రదాయం ఇక్కడ నుంచే వచ్చింది.
కేఆర్ నారాయణన్ నెలకొల్పిన సంప్రదాయం ఇదీ
తదనుగుణంగా 1998లో వాజ్పేయి సారథ్యంలోని ఎన్డీయే కూటమికి మిత్రపక్షాల నుంచి మద్దతు లేఖలు సమర్పించాలన్న విధానాన్ని నాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ నెలకొల్పారు. జాతీయ స్థాయిలో సరైన చర్యను అనుసరించడమే రాష్ట్రాలకూ ఆనవాయితీ. అయితే గవర్నర్లు తమ విచక్షణాయుతమైన నిర్ణయాలు తీసుకుంటున్నా తరుచుగా వివాదాస్పదం అవుతున్నారు.
కాంగ్రెస్ పిటిషన్ పై సుప్రీం ఇలా
తాజాగా గోవా ప్రజలు స్పష్టమైన తీర్పునివ్వక త్రిశంకు సభ ఏర్పడటంతో ప్రాంతీయ పార్టీల మద్దతు సంపాదించుకున్న బీజేపీ నేత మనోహర్ పారికర్ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గోవా గవర్నర్ మ్రుదులా సిన్హా తీసుకున్న నిర్ణయమూ అలాగే వివాదాస్పదమైంది. కానీ గోవా గవర్నర్ నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలు.. మణిపూర్ గవర్నర్ నజ్మా హెప్తుల్లా పని తేలిక చేసింది.
మ్రుదులా సిన్హా తీరు ఇదీ
గోవా గవర్నర్ ఈ చట్ర పరిధిలోనూ తీసుకున్న నిర్ణయమైనా నైతికత, అనైతికత అనే అంశాలు చర్చనీయాంశాలుగా మారాయి. చట్టబద్ధంగా గవర్నర్ మ్రుదులా సిన్హా నిర్ణయం తీసుకున్న నిర్ణయం తనకు గల విచక్షణాధికారాల పరిధిలోనిది. అది రాజ్యాంగ బద్ధంగా సరైనదైనా నైతిక ప్రమాణాలు మాత్రం విభిన్నంగా ఉన్నాయి. గోవాలో ఇంతకుముందు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించలేక పతనమైంది. ఇదే అంశం నైతిక విలువల ప్రాధాన్యాన్ని లేవనెత్తింది. సదరు ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించిన సీఎం ఓటమి పాలవ్వడమే కాక.. తిరిగి అధికారంలోకి రావడానికి అవసరమైన సీట్లు గెలుచుకోవడంలో విఫలమైన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడమే సందిగ్ధావస్థలో పడేసింది.
అధికారం కోసం మళ్లీ స్నేహం
ఎన్నికలకు ముందు మిత్ర పక్షంగా ఉన్న మహారాష్ట్ర వాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ), ఎన్నికల్లో మరో పార్టీతో కూటమిగా పోటీ చేసింది. కానీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రచారంలో చేసిన ఆరోపణలను పక్కనబెట్టి అదే పార్టీతో జత కట్టడం పూర్తిగా వ్యతిరేకం. అలాగే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కీలక విమర్శలు చేస్తూ ఎన్నికల ప్రచారం సాగించిన గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్పీ) కూడా జట్టు కట్టడం మరో విచిత్రం.
గోవాలో బీజేపీ రాజకీయాలు ఇలా..
ఇప్పటివరకు నిబద్ధత గల పార్టీగా, నైతిక విలువలకు పట్టం కడతామని చెప్పుకుంటూ వచ్చిన బీజేపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎటువంటి జిమ్మిక్కులకు పాల్పడుతుందనే విషయం గోవా రాజకీయాలు విశద పరుస్తాయి. ఇక మణిపూర్లోనూ ప్రజా తీర్పులో వెల్లడయిందీ ప్రభుత్వ వ్యతిరేక ఓటేనని స్పష్టంగా ఎన్నికల ఫలితాలు చెప్తున్నాయి. కానీ సకాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం స్పందించి ప్రభుత్వ ఏర్పాటు కోసం కదలకపోవడమే ఈ పరిస్థితికి మరో కారణమని చెప్పకనే చెప్తున్నది.
1989లో రాజీవ్ లాగే...
వరుసగా మూడు దఫాలు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించడానికి కొద్ది దూరంలో నిలిచింది. ఈ పరిస్థితి 1989లో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ విపక్షంలో కూర్చోవడానికి ప్రాదాన్యం ఇచ్చిన నేపథ్యం గుర్తుకు తెస్తున్నది. మణిపూర్లో ఇబోబిసింగ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పినా.. కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ఒబోబీ సింగ్ నాయకత్వం పట్ల నాగా యునైటెడ్ కౌన్సిల్, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్ పిపి) తదితర సంస్థలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాయి. ఆ పార్టీలు, సంస్థలు కూడా ఎన్నికల్లో పోటీ చేశాయి. కాంగ్రెస్, బీజేపీ తర్వాత మిగతా పార్టీలు, సంస్థలకు పది స్థానాల వరకూ వచ్చాయి. దాని ఫలితంగా బీజేపీ నేత రాం మాధవ్, అసోం మంత్రి హిమంత బిశ్వా శర్మ ఎడతెరపిలేని చర్చలతో తొలిసారి మణిపూర్ లో బిజెపి ప్రభుత్వం ఏర్పాటైంది.
అవకాశ వాద రాజకీయాలతో ప్రతిష్టకు దెబ్బ
మ్యాజిక్ ఫిగర్ దాటేందుకు అవసరమైన సంఖ్యాబలం మద్దతు సంపాదించుకుంటే బీజేపీ సారథ్యంలోని కూటమి (బీజేపీ ఆధ్వర్యంలోని ఆ కూటమిలోకి సదరు మిత్రపక్షాలు రావడానికి సాగిన బేరసారాలపై పలు నైతిక విలువలతో కూడిన ప్రశ్నలు, సందేహాలు సహజంగా రేకెత్తుతాయి) కి ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు అనుమతినిచ్చి తర్వాత విశ్వాస పరీక్షలో నెగ్గాలని ఆదేశించవచ్చు ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో స్పష్టమైన మెజారిటీ రాని గోవా, మణిపూర్ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం ఎలా? అన్న అంశంపై పలు ముఖ్యమైన చట్టబద్ధమైన ప్రశ్నలు, సందేహాలు తలెత్తాయి. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం అవకాశ వాద కూటములు ఏర్పడతాయన్నదీ కూడా చర్చనీయాంశంగానే మారుతున్నది.