నా డబ్బుతో 25వేల మంది మహిళలకు సురక్షా బీమా ప్రీమియం: స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీయే పాలనకు ఏడాది పూర్తైన సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని అమేథీ నియోజకవర్గంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ మంగళవారం పర్యటించారు.
ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ అమేథి ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ విఫలమైందని అన్నారు. తాను అమేథి కుటుంబానికి కూతురినని పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వం పది సంవత్సరాల్లో పూర్తి చేయలేని హామీలను తాము పది రోజుల్లో నేరవేర్చామని తెలిపారు.
ఇందుకు నిదర్శనం అమేథి-ఉంచార్ మధ్య రైల్వే లైన్ ప్రాజెక్టేనని ఆమె అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నేళ్లలో చేయలేని పనులను ఎన్డీఏ ప్రభుత్వం ఏడాది కాలంలోనే చేసిందన్నారు.
ప్రధానమంత్రి బీమా సురక్షా యోజన కింద అమేథిలోని 25 వేల మంది అంగన్ వాడీ మహిళా కార్యకర్తలకు మొదటి ఏడాది సురక్షా బీమా ప్రీమియం ప్రభుత్వ సొమ్ముతో కాకుండా తన సొంత అకౌంట్ నుంచే చెల్లిస్తానని ఆమె అన్నారు.
గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై పోటీ చేసి స్మృతి ఇరానీ ఓడిపోయిన సంగతి తెలిసిందే.