కర్నాటకలో కాంగ్రెస్ జయభేరి-స్ధానిక పోరులో బీజేపీకి భారీ షాక్-సీఎం బొమ్మై స్వస్ధలంలోనూ
కర్నాటకలో జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధికారంలో ఉండి కూడా స్ధానిక సంస్ధల ఎన్నికల్లో విజయం సాధించడంలో విఫలమైంది. విపక్ష కాంగ్రెస్ చేతిలో మెజార్టీ స్ధానాల్లో బీజేపీ ఓటమి పాలైంది. చివరికి సీఎం బసవరాజ్ బొమ్మై స్వస్ధలంలోనూ బీజేపీ ఓటమిపాలైంది.
బిజెపి పాలిత కర్నాటకలోని 20 జిల్లాల్లో ఉన్న 58 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. పట్టణ పురపాలక సంఘాలు, పట్టణ పంచాయతీలు, నగర పురపాలక సంఘాల్లో ఎన్నికలు జరిగిన 1,184 వార్డులలో, కాంగ్రెస్ అత్యధిక స్థానాలను (501), బిజెపి 433 స్థానాలను గెలుచుకుంది. జనతాదళ్ (సెక్యులర్) 45, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డిపిఐ) ఆరు, స్వతంత్ర అభ్యర్థులు 195 స్థానాల్లో విజయం సాధించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), జనతా పార్టీ ఒక్కో సీటు గెలుచుకున్నాయి. విజయనగరం జిల్లా హోస్పేటలో ఆప్ గెలిచింది.

ముఖ్యంగా, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్వస్థలమైన హవేరీలోని రెండు పట్టణ స్ధానిక సంస్ధలను బిజెపి కాంగ్రెస్ చేతిలో కోల్పోయింది. భారీ సంఖ్యలో గెలిచిన స్వతంత్రులను ఆకర్షించడానికి, ప్రతి పట్టణ స్ధానిక సంస్ధలో తమ స్థానాలను బలోపేతం చేసుకోవడానికి కాంగ్రెస్, బిజెపిలకు ఇంకా అవకాశం ఉన్నప్పటికీ, ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నాయి. బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ఈ గెలుపు నిదర్శనమని కాంగ్రెస్ నేతలు అభివర్ణించారు. అధికార బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకోవడం వారి నిస్సహాయ పాలనకు ప్రతిబింబం అన్నారు. ఇది సార్వత్రిక ఎన్నికల్లో మనం ఏం ఆశించవచ్చో తెలుస్తోందంటూ కర్ణాటకలో ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. కాగా, కేపీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్... పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు భవిష్యత్ ఎన్నికలకు కొలమానం కానప్పటికీ, ఈ ఫలితాలు కాంగ్రెస్ భావజాలం, దానిని విశ్వసించే మన ప్రజల ప్రజాదరణను ధృవీకరిస్తున్నాయని ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications