ఒక వ్యక్తికి ఒకే పదవిపై కాంగ్రెస్ యూటర్న్ ? రాజ్యసభలో విపక్ష నేతగా ఖర్గే కొనసాగింపు ?
కాంగ్రెస్ పార్టీలో ఓ వ్యక్తికి ఒకే పదవి అంటూ ఉదయ్ పూర్ లో ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్టీ చేసిన తీర్మానంపై యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. దీనికి కారణం రాజ్యసభలో విపక్ష నేత పదవిలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కొనసాగే అవకాశాలుండమే. దీంతో ఈ వ్యవహారం కాంగ్రెస్ లో మరో చిచ్చుకు దారి తీసేలా కనిపిస్తోంది.
ఉదయ్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ చేసిన తీర్మానం ప్రకారం పార్టీలో ఒక వ్యక్తికి ఒక పదవి మాత్రమే ఉండాలి. దీంతో రెండు పదవుల్లో ఉన్న నేతలంతా ఏదో ఒక పదవిలో కొనసాగుతూ మరో పదవి వదులుకున్నారు. ఇదే క్రమంలో రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్న మల్లిఖార్జున ఖర్గే కూడా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోటీ సందర్భంగా ఈ పదవికి రాజీనామా సమర్పించారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో రాజ్యసభలో విపక్ష నేతగా తానే కొనసాగాలని ఖర్గే భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ ఉదయ్ పూర్ తీర్మానం తెరపైకి వస్తోంది.
కాంగ్రెస్ పార్టీ గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలన్న విధానంతో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సమయంలో రాజస్తాన్ సీఎంగా ఉన్న అశోక్ గెహ్లాట్ ను ఆ పదవి వదులుకోవాల్సి ఉంటుందని రాహుల్ గాంధీ సూచించారు. దీంతో ఆ పదవి వదులుకుని మరీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ఆయన సిద్దమయ్యారు. కానీ తాను వదులుకునే సీఎం పదవిలో ప్రత్యర్ధి సచిన్ పైలట్ కు అవకాశం ఇవ్వొద్దని షరతు పెట్టారు. చివరికి పైలట్ ను సీఎంగా ఎన్నుకునేందుకు అధిష్టానం పంపిన దూతల భేటీకి ఎమ్మెల్యేలు వెళ్లకుండా గెహ్లాట్ అడ్డుకోవడం, చివరికి అధిష్టానం ఆగ్రహంతో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరం కావడం చకచకా జరిగిపోయాయి. అదే కాంగ్రెస్ లో రెండు పదవులకు అవకాశమిచ్చి ఉంటే ఆయన రాజస్తాన్ సీఎంగా ఉంటూ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే వారు. దీంతో అప్పట్లో గెహ్లాట్ ను అడ్డుకున్న రాహుల్.. ఇప్పుడు ఖర్గేను రాజ్యసభలో విపక్ష నేతగా కొనసాగేందుకు ఎలా అనుమతిస్తారన్న చర్చ మొదలైంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.