వ్యాపం పాపం: సాక్షిగా ఉన్న కానిస్టేబుల్ మృతి
భోపాల్: వ్యాపమ్ స్కాం విచారణలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించి మరో సాక్షి చనిపోయాడు. బుధవారం కోర్టులో సాక్షం ఇవ్వాల్సిన కానిస్టేబుల్ సంజయ్ కుమార్ యాదవ్ రెండు నెలల క్రితం మరణించాడు. కోర్టుకు బుధవారం ఈ విషయం చెప్పారు.
సంజయ్ కుమార్ యాదవ్ మృతితో కుంభకోణంతో సంబంధం ఉన్నవారిగా భావిస్తున్నవారి మరణాల సంఖ్య 36కు చేరుకుంది. సంజయ్ కుమార్ యాదవ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. ముగ్గురు నిందితులపై ఆయన జబల్పూర్ కోర్టులో బుధవారం సాక్ష్యం ఇవ్వాల్సి ఉంది.
అతను హెపిటైటిస్ వల్ల మరణించాడని, అతనిది అసహజ మరణం కాదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలంటున్నాయి. వ్యాపం కుంభకోణం కేసులో 2013 నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 వేల మందిని అరెస్టు చేశారు. ఈ స్థితిలో వ్యాపమ్ స్కాం మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కుదిపివేస్తోంది.
వ్యాపమ్ స్కామ్కు సంబంధించి నిందితులు, సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై నిఘా ఉంచింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ కేసులో మృతుల సంఖ్య 36 కాగా, అనధికారికంగా ఈ సంఖ్య 50కి పైగా చేరుకున్నట్లు తెలుస్తోంది.
ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశిస్తే విచారణ జరిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నిన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.