కరోనా కాలర్ ట్యూన్ : చిరాకులో సెల్ యూజర్స్..తప్పించుకునే '1' టెక్నిక్
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇక ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం ఎలా ఉన్నా కరోనా కాలర్ ట్యూన్స్ మాత్రం ఇప్పుడు భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఇబ్బందికరంగా మారాయి. ఎక్కడ ఎవరు ఎవరికి కాల్ చేసినా కరోనా దగ్గుతో మొదలై కోరనా వైరస్ కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల సమాచారం వినిపిస్తుంది. ప్రజలు తెలుసుకోవాల్సిన సమాచారం మాట అటుంచి ఎవరికి కాల్ చేసినా దగ్గు వినిపించటం తో ప్రజలు చిరాకు పడుతున్నారు.
ఇండియాలో కరోనా వ్యాప్తి ... అవగాహనకు కేంద్రం ప్లాన్
కరోనా వైరస్ విషయంలో అవగాహన కల్పించటం కోసం కేంద్ర ప్రభుత్వం టెలికాం సంస్థల ద్వారా ఈ తరహా ప్రచారం సాగించటం మంచిదే అయినా ప్రజలకు మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంది. ఇక భారత దేశంలో కరోనా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. చాలా దేశాలు కరోనా వైరస్ తో పోరాటం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 4 వేల 9కి చేరింది.
ఫోన్ చేస్తే కరోనా నివారణా సందేశం
ఇప్పటివరకు అధికారిక సమాచారం ప్రకారం లక్షా 14 వేల 285 మంది కరోనా బాధితులు ఉన్నారు. 6 వేల 88 మందికి సీరియస్ గా ఉంది. 113 దేశాలకు వైరస్ పాకింది. కరోనా వైరస్ చైనాలో తగ్గి ఇతర దేశాల్లో పెరుగుతోంది. మందులేని మహమ్మారి కరోనా వైరస్కు రాకుండా నివారణ మేలు అనే దిశలో ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి ఫోన్ చేసిననపుడు కరోనా అవగాహన సందేశాన్ని వినిపిస్తున్నాయి.
30 సెకన్ల పాటు ఆడియో ... కరోనా ట్యూన్ దగ్గుతో మొదలు
తద్వారా ప్రజలు అప్రమత్తంగా వ్యవహరిస్తారని సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనాపై అవగాహన కల్పిస్తూ ఎవరికి కాల్ చేసినా సరే ఫోన్లో కరోనా అవగాహనా సందేశం ఆడియో దాదాపు 30 సెకన్ల పాటు వస్తుంది. ఏ నెట్వర్క్ను మినహాయించకుండా అందరూ ఈ ఆదేశాలను పాటించాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీచేసింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా అందరికీ ఒకే కాలర్ ట్యూన్ వస్తుంది. ఇక ఈ ట్యూన్ దగ్గుతో స్టార్ట్ అవుతుంది.
చిరాకు పడుతున్న సెల్ యూజర్స్ .. సోషల్ మీడియాలో సెటైర్లు
అవగాహన పక్కకి ఉంచితే కొందరు మొబైల్ ఫోన్ వినియోగదారులు ఈ కాలర్ ట్యూన్ వల్ల ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఫోన్లు ఎక్కువ చేయాల్సిన పని ఉన్నవారు ఈ కాలర్ ట్యూన్ నుంచి విముక్తి పొందడానికి మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇదెక్కడి కరోనా దగ్గురా బాబు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.ఇక దీని నుండి తప్పించుకోటానికి ఓ టెక్నిక్ ఉపయోగించవచ్చు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది .
Recommended Video
కరోనా ట్యూన్ ఆపటానికి 1 టెక్నిక్
మనం ఫోన్ చెయ్యాలి అనుకున్న నెంబర్ డయల్ చేసి కరోనా మెసేజ్ వస్తున్నప్పుడు 1నెంబర్ నొక్కితే కరోనా కాలర్ ట్యూన్ ఆగిపోతుందని ప్రచారం జరుగుతుంది .ఇక కరోనా వైరస్ కంటే కరోనా కాలర్ ట్యూన్ , అది తప్పించుకునే టెక్నిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అందరూ ఆ టెక్నిక్ ట్రై చేసే పనిలో ఉన్నారు.