భారత్ లో కరోనా డేంజర్ బెల్స్: 33వేలకు పైగా కొత్త కేసులు; 1700 ఒమిక్రాన్ కేసులు
భారతదేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. విపరీతంగా పెరుగుతున్న కేసులు దేశాన్ని థర్డ్ వేవ్ దిశగా తీసుకు వెళుతున్నాయి. భారతదేశంలో సోమవారం 33,750 తాజా కోవిడ్ -19 కేసులు నమోదు కాగా, 123 మరణాలు నమోదయ్యాయి. ఒక్కసారిగా ఉధృతంగా పెరుగుతున్న కేసులు మళ్ళీ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 7రోజుల్లో కరోనా కేసులు ఐదు రెట్లు పెరిగినట్లుగా తెలుస్తుంది. గత 24 గంటల్లో భారతదేశంలో 10,846 రికవరీలు నమోదు అయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,45,582గా ఉంది.

దేశంలో పెరిగిన కరోనా కేసులు , ఒమిక్రాన్ వేరియంట్ కేసులు
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో ఓమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 1,700కి చేరుకుంది. అందులో 639 మంది కోలుకున్నారు . 510 ఓమిక్రాన్ కేసులతో మహారాష్ట్ర కొత్త వేరియంట్ కేసులలో అగ్రస్థానంలో ఉండగా, 351 కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. కేరళలో 156 ఓమిక్రాన్ కేసులు ఉండగా, గుజరాత్, తమిళనాడు మరియు రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో 100 కంటే ఎక్కువ కొత్త వేరియంట్ కేసులు ఉన్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తిని సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.42 శాతం. దేశంలో రోజువారీ సానుకూలత రేటు 3.84 శాతంగా ఉంది.

ప్రధాన నగరాలలో విపరీతంగా పెరుగుతున్న కేసులు
ఇప్పటికే అనేక రాష్ట్రాలు ఊహించని విధంగా కేసులతో వణికి పోతున్నాయి. కోవిడ్ కేసులు పెరగడంతో, కంటైన్మెంట్ జోన్లు పెరిగాయి . తీవ్రమైన వ్యాధి కేసులు తక్కువగా ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త అడ్డాలను పరిగణించాయి. ఢిల్లీలో 3,194 కేసులు నమోదు కాగా, ముంబైలో 8,063 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఆదివారం కోల్కతాలో మొత్తం 3,194 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది రాష్ట్రవ్యాప్త సంఖ్యలో దాదాపు సగంగా ఉంది.

15 నుండి 18 సంవత్సరాల మధ్య ఉన్న యువతకు కోవిడ్ వ్యాక్సినేషన్
ఇదిలా ఉండగా, 15 నుండి 18 సంవత్సరాల మధ్య ఉన్న యువతకు కోవిడ్ వ్యాక్సినేషన్ సోమవారం నాడు ప్రారంభమైంది. భారత్ బయోటెక్ యొక్క కోవాక్సిన్ అర్హతగల పిల్లలకు 28 రోజుల వ్యవధిలో రెండు డోస్లలో అందించబడుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పూణేలో, పూణే మున్సిపల్ కార్పొరేషన్ (PMC) నిర్వహిస్తున్న కేంద్రాలలో మొత్తం 10,000 డోసుల కోవాక్సిన్ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని పౌర ఆరోగ్య అధికారులు తెలిపారు. ఢిల్లీలో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాక్సినేషన్ కు 159 సైట్లు ఏర్పాటు చేశారు. 500 కంటే ఎక్కువ మంది పిల్లలు వ్యాక్సిన్ షాట్ లు పొందడానికి సిద్ధంగా ఉంటే, ఈ డ్రైవ్ మంగళవారం ప్రైవేట్ పాఠశాలల్లో కూడా విస్తరించబడుతుంది.

కఠిన ఆంక్షలు విధిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
కరోనా మహమ్మారి కేసులు తీవ్రంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వివిధ రాష్ట్రాల్లో కరోనా ను కంట్రోల్ చేయడానికి కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారు. భారతదేశానికి థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని పెద్దఎత్తున హెచ్చరికలు జారీ అవుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. స్వీయ నియంత్రణ పాటించడం ద్వారానే కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ కేసుల పెరుగుదల ఇదే విధంగా కొనసాగితే భారతదేశంలో అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications