మహా సర్కార్ కు కౌంట్ డౌన్ ప్రారంభం-మధ్యలో టీఎంసీ ఎంట్రీ-గౌహతిలో రెబెల్స్ కు సెగ
మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలో రేగిన కలకలం మరింత పెరుగుతోంది. నిన్నటి పరిణామాలతో కలత చెందిన సీఎం ఉద్థవ్ థాక్రే తన అధికారిక నివాసాన్ని వదిలి సొంతింటికి వెళ్లిపోయారు. అయినా రెబెల్స్ సంఖ్య తగ్గకపోతే పెరుగుతూనే ఉంది. దీంతో ఆయన ఇవాళ రాజీనామా సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఈ మొత్తం వివాదంలోకి టీఎంసీ అడుగుపెట్టింది.
ఉద్ధవ్ సర్కార్ కు కౌంట్ డౌన్
మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ఉద్ధవ్ థాక్రే సర్కార్ కు కౌంట్ డౌన్ మొదలైపోయింది. అధికార శివసేనకు వ్యతిరేకంగా ఏక్ నాథ్ షిండే మొదలుపెట్టిన తిరుగుబాటుకు మద్దతుగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్న నేపథ్యంలో పరిస్ధితులు క్రమంగా ఉద్ధవ్ చేజారిపోతున్నాయి. దీంతో ఓవైపు తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలను తీసుకుని తనదే అసలు శివసేన అని ప్రకటించేకునేందుకు షిండే సిద్దమవుతున్నారు. దీంతో రాజీనామా సమర్పించేందుకు ఉద్ధవ్ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
షిండే అడుగులపై ఉత్కంఠ
మరోవైపు శివసేన రెబెల్ ఎమ్మెల్యేలను తీసుకుని బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్ కు వెళ్లిన ఏక్ నాథ్ షిండే... అక్కడ సురక్షితం కాదని భావించి తిరిగి అస్సోంలోని గువాహటికి చేరుకున్నారు. అక్కడే ఉండి క్యాంపు రాజకీయాలు నడుపుతున్న షిండే.. ముంబైకి ఎప్పుడు తిరిగి వస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. అసలే శివసేనలో మూడింట రెండో వంతు ఎమ్మెల్యేల మద్దతుతో హుషారుగా ఉన్న షిండే.. నేడో రేపో గవర్నర్ ను కలిసి తమను శివసేన పార్టీగా గుర్తించాలని కోరబోతున్నారు. అలాగే బీజేపీకి మద్దతుగా ప్రభుత్వ ఏర్పాటుకు ఎమ్మెల్యేల లేఖను కూడా సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. అదే జరిగితే వేగంగా పరిణామాలు మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
శివసేన రెబెల్స్ కు టీఎంసీ నిరసన సెగ
శివసేన పార్టీతో విభేదించి గువాహటితో క్యాంపు రాజకీయాలు నడుపుతున్న రెబెల్ ఎమ్మెల్యేలకు ఇవాళ ఊహించని షాక్ తగిలింది. మహారాష్ట్ర సంక్షోభంలోకి బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ అనూహ్యంగా అడుగుపెట్టింది. గువాహటిలో రెబెల్స్ బస చేసిన హోటల్ బయట టీఎంసీ క్యాడర్ నిరసనలకు దిగారు. అడ్డుకున్న పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. అంతే కాదు శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు బయిటికి రావాలని నినాదాలు చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. చివరికి పోలీసులు తృణమూల్ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు.