పెట్రో ధరలపై దద్దరిల్లిన పార్లమెంటు- రాజ్యసభలో విపక్షాల ఆందోళన-వాయిదాల పర్వం
రెండో దఫా పార్లమెంటు బడ్డెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ప్రవేశపెట్టాక వాయిదా పడిన పార్లమెంటు ఇవాళ తిరిగి ప్రారంభం కావడంతో చమురు ధరల అంశం ఉభయసభల్ని కుదిపేసింది. తొలుత అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు మహిళా ఎంపీలు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి అభిప్రాయాలను పంచుకున్నారు.
ఆ తర్వాత ప్రశ్నోత్తరాలు ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. చమురు, వంటగ్యాస్ ధరలపై విపక్ష కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ''పెట్రోల్ ధర రూ.100 దాటింది. వంటగ్యాస్ ధరలు కూడా పెరిగాయి. వీటిపై సుంకాలు, సెస్లను పెంచడంతో యావత్ దేశ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు'' అని ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ధరల పెంపునకు నిరసనగా విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఛైర్మన్ వారించినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. దీంతో సభను 11 గంటల వరకు వాయిదా వేశారు.
సభ తిరిగి ప్రారంభమన తర్వాత కూడా రాజ్యసభ ప్రోసీడింగ్స్ను వాయిదా వేసి దేశ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పెట్రో ధరల పెంపుపై చర్చించాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. సభా కార్యకలాపాలను అడ్డుకున్నాయి. కానీ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య మాత్రం చర్చకు అనుమతి ఇవ్వలేదు. ద్రవ్య బిల్లుపై చర్చ తర్వాత అవకాశం ఇస్తానన్నారు. కానీ విపక్షాలు మాత్రం పట్టు వీడలేదు. సమావేశాల తొలిరోజే కఠిన నిర్ణయాలు తీసుకోలేనని నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలను ఉద్దేశించి వెంకయ్య వ్యాఖ్యానించారు. ఎంపీల నిరసనల మధ్యే సభ మరోసారి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ వాయిదా పడింది.