'పప్పీచినో': ఢిల్లీలో తొలి డాగ్ కేఫే (వీడియో)
న్యూఢిల్లీ: మూగజీవాలంటే చాలా మందికి ప్రాణం. మూగజీవాల్లో అత్యధికంగా కుక్కలే ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటున్నాయి. మనకు ఇష్టమైన సమయంలో ఇష్టం వచ్చిన హోటల్ లేదా రెస్టారెంట్కు వెళ్లి హాయిగా తినేసివస్తాం. కానీ ఆ సౌలభ్యం కుక్కలకు లేదు.
అయితే ఆగ్నేయ ఆసియాలో కుక్కల కోసం ప్రత్యేకించి కెఫేలు ఉన్నాయి. కాస్త ఆలస్యంగా అయినా ఈ సంస్కృతి భారత్లో ఇప్పుడే అడుగులు వేస్తోంది. జంతువులతో కెఫేలకు వెళదామంటే అనుమతించరు. కానీ ఢిల్లీకి చెందిన ఇద్దరు అమ్మాయిలు ఈ సమస్యకు పరిష్కారం చూపించారు.
కుక్కలతో కలిసి హోటల్కు వెళ్లేవారి కోసం ప్రత్యేకంగా కెఫేను ప్రారంభించారు. దానిపేరు ''పప్పీచినో''. ఢిల్లీలోని ట్రెండీ, పోష్ లొకాలిటీగా పేరొందిన ప్రాంతాల్లో ఒకటిగా పేరుగాంచిన హాజ్ ఖాస్ గ్రామంలో దీనిని ఇటీవలే ప్రారంభించారు. ఈ కెఫే ప్రత్యేకత ఏంటంటే కుక్కులను మీ వెంట తీసుకొని వెళ్లి 'పప్పిచినో'లో కాసేపు సరదాగా గడపొచ్చు.
మీకు నచ్చిన వంటకాలను ఆర్డర్ చేసి మరీ తెప్పించుకుని తినొచ్చు. కుక్కలు తినే ఆహార పదార్థాలు కూడా ఇక్కడ పూర్తిగా లభ్యమవుతాయి. అంతేకాదు పెంపుడు కుక్కల పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు ఈ కెఫే అవకాశాన్ని కల్పిస్తోంది.
'పప్పిచినో' హోటల్కు ఢిల్లీ వాసుల నుంచి అనూహ్యరీతిలో స్పందన లభించడం చూసి యజమాని ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ రెస్టారెంట్లో కుక్కలకు ఎంతో ఇష్టమైన పాన్ కేక్స్, ముఫ్ఫిన్స్, ఇటాలియన్, టెక్స్-మిక్స్, అమెరికన్, ఇజ్రాయిలీ వంటకాలను కూడా అందుబాటులో ఉంచారు.