భారత్ నుంచి బీపీఓ ఇండస్ట్రీ ఔట్: డీజిల్ బ్యాన్పై కోర్టుకు కేంద్రం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ రీజియన్లో డీజిల్ క్యాబ్లపై నిషేధం విధించాలన్న సుప్రీం కోర్టు ఉత్తర్వులపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. డీజిల్ క్యాబ్లపై నిషేధం విధిస్తే భారత్లోని బిలియన్ డాలర్ బీపీఓ పరిశ్రమ మొత్తం దేశం నుంచి తరలిపోయే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టుకు తెలిపింది.
భారత్లోని బీపీఓ ఉద్యోగులంతా దాదాపుగా కంపెనీలు ఏర్పాటు చేసే క్యాబ్లలోనే ఆఫీసులకు ఇళ్లకు వెళ్తుంటారని తెలిపింది. కంపెనీలు చాలా వరకు డీజిల్ క్యాబ్లను ఉపయోగిస్తుండటం విశేషం. భారత్లోని బీపీఓ పరిశ్రమ ద్వారా ప్రభుత్వానికి ప్రతి ఏటా సుమారుగా బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని కోర్టుకు తెలిపింది.
తాజా నిర్ణయం వల్ల మన దేశం నుంచి బీపీఓ పరిశ్రమ వేరే దేశానికి వెళ్లిపోయే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనానికి సాలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ తెలిపారు.
ఇదిలా ఉంటే ఐదు సంవత్సరాల్లో దశల వారీగా మొత్తం డీజిల్ క్యాబ్లు అన్నింటినీ ఢిల్లీ రోడ్లపై నుంచి తీసేయిస్తామని, అంతవరకు గడువు ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టుని కోరింది. రాజధాని ఢిల్లీలో డీజిల్ క్యాబ్లు రోడ్లపై తిరిగేందుకు సుప్రీంకోర్టు పెట్టిన మే 1వ తేదీ గడువును పొడిగించేందుకు కోర్టు ఏప్రిల్ 30న నిరాకరించింది.
ఈ నేపథ్యంలో బీపీఓ ఉద్యోగుల భద్రత అంశాన్ని కూడా తాము పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని, ఈ పరిశ్రమ మనుగడను కూడా దృష్టిలో పెట్టుకోవాలని కేంద్రం సుప్రీం కోర్టుకు విన్నవించింది. తమ ఉద్యోగులకు అసౌకర్యంగా ఉంటే బీపీఓ పరిశ్రమ దేశం నుంచి వెళ్లిపోవచ్చని, అది దేశ ఎకానమీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని అన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన ధర్మాసనం బీపీఓ కంపెనీలు బస్సులను అద్దెకు తీసుకుని తమ ఉద్యోగులకు పికప్, డ్రాప్ సదుపాయాన్ని అందించొచ్చు కదా ప్రశ్నించింది. అనంతరం తదుపరి విచారణను మే 9కి వాయిదా వేసింది. రాజధానిలో డీజిల్ క్యాబ్లపై నిషేధం విధిస్తూ దీనికి సంబంధించిన సమగ్ర ప్రణాళికను అందించాల్సిందిగా మే 3న ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.