ఈసీ వర్సెస్ దీదీ: ఎన్నికల ప్రచారం నిషేధంపై మమతా బెనర్జీ ధర్నా, బ్లాక్ డే అంటూ టీఎంసీ ఫైర్
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ మత ప్రాతిపదికన ఓట్లు అభ్యర్థించడం, కేంద్ర బలగాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. 24 గంటల పాటు ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఆమె ప్రచారంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
12 గంటలకు కలకత్తాలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చెయ్యనున్న మమతా బెనర్జీ
అయితే తన ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించడాన్ని మమతా బెనర్జీ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం అప్రజాస్వామిక నిర్ణయమని, రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయమని పేర్కొన్న ఆమె ఈరోజు 12 గంటలకు కలకత్తాలోని గాంధీ విగ్రహం వద్ద తన నిరసన తెలియజేస్తానని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఏప్రిల్ 12 మన ప్రజాస్వామ్యంలో బ్లాక్ డే అని , రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేంద్రంతో రాజీ పడిందని తీవ్ర విమర్శలు గుప్పించారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు డెరెక్ ఓ'బ్రియన్ . ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.
మమతా బెనర్జీకి రెండు నోటీసులు ఇచ్చి వివరణ కోరిన ఈసీ
బెంగాల్ ఎన్నికల పోరులో ఇప్పటివరకు ఎన్నికల కమిషన్ మమతా బెనర్జీకి గత వారం రెండు నోటీసులు ఇచ్చింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని నోటీసులో పేర్కొంది. మార్చి 28 మరియు ఏప్రిల్ 7 న జరిగిన ఎన్నికల ప్రసంగాలలో ఆమె వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ కోరింది. ఈ రెండింటిలో కేంద్ర శక్తులు ఓటర్లను బెదిరించారని, మహిళలను ఉద్దేశించి ఆమె తిరిగి ఎదురు దాడి చేయాలని మమతా బెనర్జీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఎన్నికల కమిషన్ కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.
సిఆర్పిఎఫ్ పై అనుచిత వ్యాఖ్యలు , మత ప్రాతిపదికన ఓట్ల అభ్యర్థనలపై ఈసీ సీరియస్
ఈ ఫిర్యాదులపై ఆమె సమాధానం కోసం ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ (సిఆర్పిఎఫ్) గురించి మమతా బెనర్జీ అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారని, మత ప్రాతిపదికన బహిరంగంగా ఓట్లు కోరడంపై కూడా వివరణ ఇవ్వాలని ఈసీ కోరింది . ఈ నోటీసులపై స్పందిస్తూ, మమతా బెనర్జీ "మీరు (ఇసి) నాకు 10 షో-నోటీసులను జారీ చేయవచ్చు, కాని నా సమాధానం ఒకే విధంగా ఉంటుందని ఈసీ నోటీసులపై నిప్పులు చెరిగారు మమతా బెనర్జీ.
ఎన్నికల కమీషన్ నిస్పక్షపాతంగా వ్యవహరించటం లేదన్న టీఎంసీ నేతలు
అటు ఎన్నికల కమిషన్ తో, ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పోరాడుతున్న మమతా బెనర్జీ నరేంద్ర మోడీ, అమిత్ షా లు ఎన్నికల నిబంధనలు పాటించకుండా చేస్తున్న వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఈ రోజు మాత్రం ఎన్నికల కమిషన్ తీరును నిరసిస్తూ ధర్నా చేస్తానని ప్రకటించారు మమతా బెనర్జీ. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, ఎన్నికల కమిషన్ ధోరణిపై తమకు మొదటినుంచి అనుమానాలున్నాయని టీఎంసీ ఉపాధ్యక్షుడు యశ్వంత్ సిన్హా వ్యాఖ్యానించారు.
మోడీ , షా ల ఆదేశాల మేరకే ఈసీ పని చేస్తుందని ఆగ్రహం
మమత పై విధించిన నిషేధంతో ఈసీ వేసుకున్న ముసుగు పూర్తిగా తగ్గిపోయిందని, ఎన్నికల కమిషన్ పూర్తిగా మోదీ, షా ల కనుసన్నల్లో పని చేస్తుందంటూ మండిపడుతున్నారు. ఇక ఈ రోజు మమతా బెనర్జీ ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నేపధ్యంలో బెంగాల్ లో ఎన్నికల సమయంలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరుకుంది.