బీజేపి వేధింపులు ఎలా మరిచిపోగలను? ఎన్నికల్లో పొత్తుల్లేకుండానే : మాయావతి
లక్నో : రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించి దేశమంతా ఆసక్తి ఎదురుచూస్తుండగా.. స్థానిక పార్టీలు ఎన్నికల వ్యూహాల్లో బిజీగా మారిపోయాయి. రాబోయే ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలపై తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపోవడం గానీ, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమనే ప్రసక్తే ఉండదని కుండబద్దలు కొట్టారు. గతంలో తనను బీజేపీ ఎంత వేదనకు గురిచేసిందో ఇప్పటికీ మరిచిపోనని అన్నారు. 2003లో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో.. తాజ్ కారిడార్ కేసులో తనను వేధించిన సంగతి అంత సులువుగా ఎలా మరిచిపోతానని పేర్కొన్నారు.
ఓవైపు కాన్షీరామ్ చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో ఉంటే బీజేపీ తమ కుటుంబంపై దాడులు చేయించిందని మండిపడ్డారు మాయావతి. రాబోయే యూపీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటికి దిగుతామని, తప్పకుండా అధికారాన్ని చేజిక్కించుకుంటామని స్పష్టం చేశారు. పొత్తుల్లేకుండా విజయం సాధించడం పట్ల మాయావతి ధీమాగా ఉన్నారు. సాంప్రదాయ ఓటు బ్యాంకుతో పాటు మైనారిటీలు కూడా బీఎస్పీ వెనుకే ఉన్నారని తెలిపారు.
బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకోగలిగే సత్తా బీఎస్పీకే ఉందని, ఎస్పీకి వాళ్లలో వాళ్లు కొట్టుకోవడానికే సరిపోతుందని ఎద్దేవా చేశారు మాయావతి.