‘భారత్ ఉదారంగా ఉంటే.. పాక్ ఇలా ఎందుకు?’
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్కి పాకిస్థాన్ తొలుత వీసా ఎందుకు తిరస్కరించిందో కారణాలు చెప్పాలని భారతీయ జనతా పార్టీ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ డిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్ ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టతనిచ్చి తప్పును సరిదిద్దుకోవాలన్నారు.
పాకిస్థాన్ కళాకారులు ఇక్కడకి రావడానికి భారత్ చాలా ఉదారంగా వీసాలు జారీ చేస్తోందని.. అలా పాక్ ఎందుకు వ్యవహరించట్లేదని నిలదీశారు. కరాచీ సాహిత్య ఉత్సవాల్లో పాల్గొనేందుకు అనుపమ్ వీసాకు దరఖాస్తు చేసుకోగా.. దాన్ని పాక్ తొలుత తిరస్కరించింది.
ఈ విషయమై అనుపమ్ ఖేర్ మంగళవారం స్పందించారు. తనకు తప్ప మిగతావారందరికీ వీసాలు వచ్చాయని, ఈ విషయంలో తాను ఎంతో బాధపడుతున్నానని మీడియాకి తెలిపారు. తాను కాశ్మీర్ పండిట్ను కాబట్టే పాక్ వీసా నిరాకరించిందని అన్నారు.
ఈ నేపథ్యంలో ఆయనకు మళ్లీ వీసా ఇస్తామంటూ పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్కి స్పందించిన అనుపమ్ ఖేర్.. ఆఫర్కి ధన్యవాదాలు తెలిపారు. కానీ, ప్రస్తుతం తనకు డేట్స్ ఖాళీ లేవని చెబుతూ దాన్ని అనుపమ్ సున్నితంగా తిరస్కరించారు.