టీటీవీ దినకరన్ కు షాక్ ఇచ్చిన కోర్టు: రావాల్సిందే, జైలుకా, లేదంటే, ఆందోళన !
20 ఏళ్లకు పైగా విచారణ సాగుతున్న ఫెరా కేసు విచారణను త్వరితగతిన ముగించాలని హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయని, ప్రతి రోజు కేసు విచారణ జరుగుతుందని, టీటీవీ దినకరన్ కచ్చితంగా విచారణకు హాజరుకావాలని ఎగ్మూరు కో
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి, ఆర్ కే నగర్ అన్నాడీఎంకే అమ్మ పార్టీ అభ్యర్థి టీటీవీ. దినకరన్ కు ఎగ్మూరు కోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు పూర్తి అయ్యే వరకు విచారణకు తాను హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలని ఆయన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది.
1996-97లో శశికళ, ఆమె బంధువులు టీటీవీ. దినకరన్, భాస్కరన్ లపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ వర్గాలు విదేశీమారక ద్రవ్యం బదిలీల్లో మోసం కేసు నమోదు చేశాయి. అమెరికాలోని రిన్సాట్ లిమిటెడ్, సింగపూర్ అప్పు రేజ్ పాయింట్ సంస్థలకు ఎలాంటి అనుమతులు, రికార్డులు లేకుండా నగదు బదిలీ చేసినట్లు వెలుగు చూసిన అంశాల మేరకు ఈ కేసు నమోదైంది.
20 ఏళ్ల నాటి కేసు నుంచి తప్పించుకోవాలని
గత 20 ఏళ్లకు పైగా ఈ కేసు విచారణలో ఉంది. ఇదే సమయంలో అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ, ఆపార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా టీటీవీ. దినకరన్ అవతరించారు. ఈ కేసును సత్వరం విచారించాలని ఇటీవల మద్రాసు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
నేను ఆర్ కే నగర్ నియోజక వర్గం అభ్యర్థిని
ఈ కేసు నుంచి తనను విడిపించాలని దినకరన్ కోర్టును ఆశ్రయించారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు రావడంతో టీటీవీ. దినకరన్ అక్కడ అభ్యర్థి అయ్యి పోటీ చేస్తున్నారు. తానే అభ్యర్థి అయినందున ప్రచారం చెయ్యడానికి వీలుగా తనను విచారణ నుంచి మినహాయించాలని దినకరన్ ఎగ్మూరు ఎకనామిక్స్ అఫెన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కుదరదు అని తేల్చి చెప్పిన కోర్టు
సోమవారం ఈ పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తి మలర్ మతి దినకరన్ అభ్యర్థనను తోసిపుచ్చారు. 20 ఏళ్లకు పైగా విచారణ సాగుతున్న ఈ కేసు విచారణను త్వరితగతిన ముగించాలని హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయని, మంగళవారం నుంచి ప్రతి రోజు కేసు విచారణ జరుగుతుందని న్యాయమూర్తి దినకరన్ కు షాక్ ఇచ్చారు.
కోర్టు మెట్లు ఎక్కడానికి సిద్దం కావాలి
ఈ దెబ్బతో తనను విచారణకు ఎప్పుడు పిలుస్తారో, ఎప్పుడు కోర్టు మెట్టు ఎక్కాలోనన్న కొత్త సమస్య ఉప ఎన్నికల సమయంలో దినకరన్ కు చుట్టుముట్టుకునింది. ఓ వైపు పాత కేసు విచారణ వేగవంతం చెయ్యాలని ఎగ్మూరు కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో 2015లో శశికళను నిర్దోషిగా ప్రకటించారు. దినకరన్ నేరం చేశాడని వెలుగు చూడటంతో రూ. 28 కోట్ల అపరాధ రుసుం విధించారు.
హైకోర్టులో మరో పిటిషన్
మరో వైపు టీటీవీ. దినకరన్ నామినేషన్ ను తిరస్కరించాలని సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అన్నాడీఎంకే పార్టీకి ఎన్నికల గుర్తింపులేదని ట్రాఫిక్ రామస్వామి తన పిటిషన్ లో తెలిపారు.
సంతకాలు లేవని తెలిసింది
అన్నాడీఎంకే పార్టీకి గుర్తింపు లేకపోవడంతో టీటీవీ. దినకరన్ ను స్వతంత్ర అభ్యర్థిగా పరిగణించాల్సి ఉందని ట్రాఫిక్ రామస్వామి తన పిటిషన్ లో వివరించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే వారికి సంబంధిత నియోజక వర్గంలోని 10 మంది నామినేషన్ లో సంతకాలు చేయాల్సి ఉందని, దినకరన్ నామినేషన్ లో ఆ సంతకాలు చెయ్యలేదని సమాచారం ఉందని, ఆయన నామినేషన్ పరిగణలోకి తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ట్రాఫిక్ రామస్వామి మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు.